మహబూబాబాద్: బలరాం గట్టెక్కేనా, జగన్పార్టీతో చీలిక
వరంగల్/ఖమ్మం: కేంద్రమంత్రి బలరాం నాయక్ మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్నారు. ప్రత్యర్థుల నుండే కాకుండా.. సొంత పార్టీలో విభేదాలు ఆయనకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో కాంగ్రెస్, టిడిపి, తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. గిరిజనులకు రిజర్వ్ చేసిన నియోజకవర్గం.
కాంగ్రెసు నుండి సిట్టింగ్ ఎంపి బలరాం నాయక్, టిడిపి నుండి మోహన్లాల్, తెరాస నుండి ప్రొఫెసర్ సీతారాం నాయక్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి తెల్లం వెంకట్రావ్లు పోటీ చేస్తున్నారు. మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు నియోజకవర్గాలతోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాలు ఉన్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థి బలరాం గెలుపుకోసం ఈసారి అష్టకష్టాలు పడవలసిన పరిస్థితి నెలకొంది. నర్సంపేట నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న దొంతి మాధవ రెడ్డిని కాదని జెఎసి నాయకుడు వెంకట స్వామికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి మాలోతు కవిత పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, ఖమ్మం జిల్లా పినపాక అసెంబ్లీ స్థానాన్ని సిపిఐకి కేటాయించడం బలరాం గెలుపుపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.
టికెట్లు దక్కని నాయకులు ఈ నియోజకవర్గాలలో ఇండిపెండెంట్లుగా పోటీకి చేస్తుండటం బలరాంకు మింగుడు పడటం లేదు. దీనికితోడు పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్ర రాష్ట్రంలో కలపడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని ప్రభావం కూడా బలరాంకు ఇబ్బందికరంగా మారింది. ఇల్లందులో ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉండటం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాన్ని సిపిఐకి కేటాయించడం కూడా బలరాం నాయక్కు ఇబ్బంది కలిగించే అంశాలుగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, తాను చేసిన పనులు తనను గెలిపిస్తాయని బలరాం ధీమాగా ఉన్నారు.
తెరాస సీతారాం అధ్యాపక వృత్తి నుంచి నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. రాజకీయంగా ఆయనకు వ్యక్తిగత పట్టు లేకపోవడం మైనస్. వరంగల్ జిల్లాకు చెందిన మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాలలో తెరాస తరపున బలమైన అభ్యర్థులు పోటీలో ఉన్నా ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో అలాంటి పరిస్థితి లేదు. ఖమ్మంలోని పలు నియోజకవర్గాల్లో తెరాసకు బలం లేదు. అయితే, తెలంగాణవాదం గట్టెక్కిస్తుందని సీతారం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, నాలుగునెలల కిందట ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన మోహల్ లాల్కు మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో టిడిపికి గట్టి పట్టు, కష్టపడే క్యాడర్, బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటం మోహన్ లాల్కు ప్లస్గా మారింది. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టిడిపి తీరు ఆయనకు మైనస్.
వరంగల్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా... ఆ పార్టీ ఖమ్మం జిల్లాకు పరిమితం కానుందని అంటున్నారు. ఇది మిగిలిన మూడు పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఖమ్మం జిల్లాలోని సెగ్మెంట్లలో జగన్ పార్టీ అభ్యర్థి ఎవరి ఓట్లను చీల్చుతారనే ఆందోళన నెలకొంది. ప్రధానంగా కాంగ్రెసు, టిడిపి అభ్యర్థులపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశముంది.












Click it and Unblock the Notifications