RGV: గుర్రమెక్కిన గురుడు..వరుస ట్వీట్ల రచ్చ.. బన్నీ, మహేష్లే టార్గెట్..!
ఆర్జీవీ... రాంగోపాల్ వర్మ.. సెన్సేషనల్ డైరెక్టర్. ఆర్జీవీ ఏం మాట్లాడినా అందులో ఏదో నిగూఢమైన అర్థం దాగి ఉంటుంది. అందుకే కొందరు రామూను మ్యాడ్ ఫెలో అంటే చాలామంది మాత్రం రాంగోపాల్వర్మను ఎంతో ఇష్టపడుతారు. ఆయన వయస్సు ఆరుపదులకు దగ్గరలో ఉన్నా రామూ మాత్రం యంగ్ ఎట్ హార్ట్ అని అంటారు. ఇక రాంగోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి ఒక హీరోయిన్ వచ్చిందంటే చాలు... ఆమె అందాలను ఎన్ని రకాలుగా ఎన్ని యాంగిల్స్లో చూపించొచ్చో అన్ని విధాలుగా రామూ ప్రేక్షకులకు మాంచి ఫీస్ట్ పెడతారు.. అదేనండీ అందాల విందు. అప్పటి ఊర్మిళా మంటోడ్కర్ నుంచి ఇప్పటి అప్సరా రాణి వరకు అంతా హాట్ బ్యూటీసే. ఇదంతా ఇలా ఉంటే రాంగోపాల్ వర్మ న్యూఇయర్ వేడుకల్లో అప్పుడే మునిగిపోయినట్లున్నారు. గురుడు గుర్రం ఎక్కినట్లున్నాడు. ఇక తగ్గేదేలే అంటూ ట్వీట్ల గోల మొదలెట్టేశారు. అయితే రామూ చేసిన ఈ ట్వీట్లలో కొన్ని సత్యాలున్నాయన్న సంగతి మరువకూడదు. ఇంకెందుకు ఆలస్యం ఈ సంచలన డైరెక్టర్ వేసిన ట్వీట్లు ఒకసారి చూసేద్దామా...
ఒమిక్రాన్ వార్తలతో...
రాంగోపాల్ వర్మ డిసెంబర్ 31వ తేదీన వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. పెగ్గేసినట్లున్నారు.. పెగ్గుకొక ట్వీట్ వేసినట్లు కనిపిస్తోంది. కానీ రామూ ట్వీట్ చేసిన ట్వీట్స్ను కాస్త లోతుగా ఆలోచిస్తే అవి నిజమే అనిపిస్తాయి. గురుడు కొన్ని ట్వీట్లు సెన్సేషన్ కోసం చేస్తే మరికొన్ని ట్వీట్లు మాత్రం ఆలోచింపజేసేలా ఉన్నాయి. "కొత్త ఏడాది అనేది డిసెంబర్ 31 రాత్రి వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుదనే సంతోషంలో ఫుల్గా మందేసి జనవరి 1వ తేదీన ఉదయం తలనొప్పితో నిద్రలేవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పి తీసుకున్న మద్యంతో పాటు ఒమిక్రాన్ నుంచి వస్తుంది. ఒమిక్రాన్ డిసెంబర్ 31 రాత్రి పార్టీలోనే వచ్చే అవకాశముంది " అంటూ తొలి ట్వీట్ చేశారు ఆర్జీవీ
న్యూ ఇయర్ విషెస్లో అర్థం లేదు
ఇక రెండో ట్వీట్ ఇలా ఉంది."జనవరి 1వ తేదీ నుంచి కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏడాది ప్రారంభమే ఇంత దారుణంగా ఉంటే.. ఇక ఒకరికొకరు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకోవడంలో అర్థం లేదు. శాడ్ న్యూఇయర్" అంటూ సెటైరికల్ ట్వీట్ వేశారు రామూ. అయితే ఆర్జీవీ చెప్పినట్లు ఇది నిజమే కదా అని అనిపిస్తుంది.
పాత సమస్యలు కొత్త సంవత్సరంలో...
ఇక మూడో ట్వీట్ను సీరియస్గా వేశారు రాంగోపాల్ వర్మ. ఏటా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొందరు ఇడియట్స్ విష్ చేస్తుంటారని కానీ ఎప్పుడూ హ్యాపీగా సాగదని ఎందుకంటే పాత సమస్యలన్నీ కొత్త సంవత్సరంలో కూడా కొనసాగితే ఇక సంతోషం ఎక్కడుందంటూ రామూ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు కొత్త సంవత్సరంలో కూడా కొనసాగితే ఇక పాత సంవత్సరమే ఉన్నట్లుంటుంది కదా అని చెప్పుకొచ్చారు.
విషెస్కు పెద్దగా ఖర్చు ఉండదు..
ఇక నాల్గవ ట్వీట్లో మాత్రం ఆర్జీవీ నగ్న సత్యం చెప్పారు. విషెస్ చెప్పేందుకు ఎలాంటి ఖర్చు ఉండదు కాబట్టి తాను మరీ అంత పిసినారిని కాదన్నారు. అందరికీ 20వేల టన్నుల బంగారం, అంబానీకంటే మంచి ఇళ్లు, వైరల్ ప్రూఫ్ హెల్త్ కార్డులు దక్కాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు భార్యల నుంచి బాధపడుతున్న భర్తలకు వారి భార్యలు దూరం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో అందమైన హీరోయిన్లు ఈ భర్తల కోసం పరుగెత్తుకుంటూ రావాలని కోరుకున్నారు రాము.
అల్లు అర్జున్ మహేష్ బాబుల కంటే...
ఈ ఏడాది నుంచి కష్టకాలంలో ఉన్న ప్రతి ఒక్క నటుడు అల్లు అర్జున్, మహేష్ బాబులకంటే పెద్ద స్టార్లు కావాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇక పేదరికంలో ఉన్నవారంతా అంబానీ అదానీల కంటే ఎక్కువగా సంపాదించాలని, అందవిహీనులమని బాధపడేవారికి దీపికా పదుకొణే, ఆలియా భట్లాంటి అందమైన అమ్మాయిలు ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఇక కరోనా వైరస్ శాశ్వతంగా మాయమవ్వాలని తాను కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు రామూ.
తీర్మానాలు వేస్ట్
ఇక ఫైనల్గా రామూ అదిరిపోయే ట్వీట్ ఒకటి వేశారు. ఈసారి కొత్త సంవత్సరం తీర్మానాలపై ట్వీట్ చేశారు. జనవరి 1వ తేదీన తీసుకునే తీర్మానాలు లేదా రిజల్యూషన్స్ జనవరి 2వ తేదీనుంచే పాటించరనే నగ్నసత్యాన్ని చెప్పారు. ఇంతకంటే దారుణమేంటంటే గతేడాది తీర్మానాలే వారు పాటించలేదనే విషయాన్ని గుర్తుంచుకోరు.
మొత్తానికి ఆర్జీవీ డిసెంబర్ 31వ తేదీన వరుస ట్వీట్లతో కేక పుట్టించారు. ఆర్జీవీ ట్వీట్లు రీట్వీట్ చేస్తున్నారు కొందరు నెటిజెన్లు. మరికొందరు లైకులు కొట్టి ఆర్జీవీకి కౌంటర్ రిప్లయ్ ఇస్తున్నారు.