లోకేష్ కొండెర్రిపప్ప.. జగన్ను ఛాలెంజ్ చేసేంత ఉందా?: ఫైర్బ్రాండ్ రోజా ఘాటు విమర్శలు
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లపైనా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు, పట్టాభి సీఎం జగన్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పట్టాభి లాంటి కుక్కలతో అంటూ చంద్రబాబుపై రోజా ఫైర్
పట్టాభి లాంటి కుక్కలతో ప్రెస్మీట్ పెట్టించిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి విజయమ్మను తిట్టించారని మండిపడ్డారు. సీఎం జగన్పై పట్టాభి చేత చంద్రబాబు చెప్పించిన అనుచిత వ్యాఖ్యలు.. చంద్రబాబు, లోకేష్లపై చేయిస్తే భువనేశ్వరి ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. కుట్రపూరిత రాజకీయాలకు, రాక్షస క్రీడలకు నిలయంగా టీడీపీ కార్యాలయం మారిందని మండిపడ్డారు.
కొండెర్రిపప్ప.. జగన్ను ఛాలెంజ్ చేసేంత ఉందా?: రోజా
గురువారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. రాజకీయ విమర్శ చేయవచ్చు కానీ వ్యక్తిగతంగా విమర్శించకూడదని రోజా హితవు పలికారు. టీడీపీ కార్యాలయంలో నాలుగులు కుర్చీలు విరగ్గొడితే ప్రజస్వామ్యం ఖూనీ అయిందా? అని ఆమె ప్రశ్నించారు. లోకేష్ కొండెర్రిపప్ప.. జగన్ను ఛాలెంజ్ చేసేంత ఉందా? అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అప్పుడే ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారన్న రోజా
ఎప్పుడైతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నాడో అప్పుడే ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్న విషయం చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలన్నారు రోజా. తిరుమల వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు సిగ్గులేకుండా అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రానికి రావాలనడం సిగ్గుచేటని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని రోజా మండిపడ్డారు. ఇకనైనా ఇలాంటి పనులు మానండంటూ ఆమె ప్రతిపక్షపార్టీకి సలహా ఇచ్చారు. కాగా, అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనాగ్రహ దీక్షలు జోరుగా జరుగుతున్నాయి. నెల్లూరులో భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించారు.
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని నోటితో చెప్పలేని భాషలో తిట్టడమే కాక రాష్ట్ర బంద్కు పిలుపిచ్చి, అది విఫలం కావడంతో 36 గంటల దీక్షకు దిగాలన్న చంద్రబాబు నిర్ణయం అప్రజాస్వామికమని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. విశాఖలో చేపట్టిన జనాగ్రహ దీక్షలో ఎంపీ పాల్గొన్నారు. బూతు వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో రెండ్రోజుల పాటు జనాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అప్పుడు అమిత్ షాపై రాళ్లేయించిన చంద్రబాబు అంటూ పేర్ని ఫైర్
మరోవైపు మంత్రి పేర్ని నాని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుది ఎంత నీచత్వానికి అయిన తెగించే మనస్తత్వం అని పేర్ని నాని విమర్శించారు. 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం మొదలు పెట్టారని, కొంగ దీక్షలు చేస్తూ ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. బూతులు సమర్థిస్తూ చంద్రబాబు దీక్షలు చేస్తున్నారా?, ఈ దీక్ష ఎవరి కోసమని మంత్రి నిలదీశారు. ప్రజలు ఆరాధించే గొప్ప మనిషిని బూతులు తిడతారా అంటూ మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో పదజాలం ఉందని అన్నారు. సిగ్గు వదిలేసి చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా దగ, దోపిడీ, కుట్రలేనని.. టీడీపీని ముంచడానికి చంద్రబాబు కొడుకు లోకేష్ ఒక్కడు చాలు. అమిత్షాపై రాళ్లదాడి చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.