ఫ్యూచర్-రిలయెన్స్తో జట్టు, బాబు దోపిడీ ఎంతో చూడండి: రోజా హెచ్చరిక, లోకేష్ దుమ్ము దులిపి
Recommended Video

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రిటైల్ గ్రూప్స్ను తన వాళ్లకు ఇచ్చుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా బుధవారం మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడు అంటే ఎలా నమ్ముతామని వ్యాఖ్యానించారు.
నీ కుటుంబానికి వాటాలు ఉన్నాయని రిలయెన్స్, ఫ్యూచర్ గ్రూప్లకు ప్రభుత్వ రిటైల్ సంస్థలను ఇస్తే ప్రజలు, వైసీపీ కలిసి తరిమితరిమి కొడుతాయని ఆమె హెచ్చరించారు. సీఎం పదవిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసే ప్రతీది స్వలాభమే అన్నారు.
ఫ్యూచర్, రిలయెన్స్ గ్రూప్ తక్కువ ధరకు ఇవ్వబోయేది నిజమే అయితే ప్రధాని మోడీ దేశం మొత్తం ఇవ్వమంటే ఇస్తారా అని ప్రశ్నించారు. మేం పాలు, కూరగాయలు అమ్ముకొని బతుకుతుంటామని చంద్రబాబు అంటుంటారని రోజా ఎద్దేవా చేశారు. సూటుకేసుల కోసమే చంద్రబాబు పనులు చేస్తున్నారన్నారు.

దీంతోనే చంద్రబాబు దోపిడీ ఎంతుందో తెలుస్తోంది
మంగళవారం చంద్రబాబు ప్రారంభించిన చంద్రన్న విలేజ్ మాల్స్ చూస్తుంటే ఆయన దోపిడీ ఏ మేరకు ఉందో అర్థమవుతోందని రోజా అన్నారు. పేద ప్రజలకు ఆహార భద్రత కోసం గత ప్రభుత్వాలు రేషన్ షాపులు అందిస్తే, చంద్రబాబు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, తన పదవిని అడ్డు పెట్టుకొని, చిన్న చిన్న వ్యాపారుల పొట్ట కొట్టేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.

తమ కంపెనీలో వాటాలు ఉన్న వారికి ఎలా ఇచ్చారు
రేషన్ షాపులను ఇక చంద్రన్న విలేజ్ మాల్స్గా మార్చబోతున్నారని రోజా మండిపడ్డారు. అయితే ఆ కాంట్రాక్టులను స్వయంగా చంద్రబాబు కంపెనీలో వాటాలు ఉన్న ఫ్యూచర్ గ్రూపుకు, రిలయెన్స్ గ్రూప్కు ఇచ్చారని మండిపడ్డారు. రిలయెన్స్ వంటి సంస్థలు వ్యాపార ధోరణి కలిగి ఉన్న సంస్థలు అని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు దోపిడీ తెలుస్తోంది
రేషన్ షాపుల్లో తొలుత సరుకులు తగ్గించి, కేవలం బియ్యం ఇస్తుంటే ఎవరికీ అర్థం కాలేదని, కానీ చంద్రన్న విలేజ్ మాల్స్ను చూస్తుంటే చంద్రబాబు దోపిడీ అర్థమవుతోందని రోజా మండిపడ్డారు. ఫ్యూచర్ గ్రూప్ వంటి వారు లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఎందుకు ఇవ్వాలనుకుంటారో చెప్పాలని నిలదీశారు.

ఏ వ్యాపారి అయినా లాభం కోసమే
ఏ వ్యాపారి అయినా ఓ రూపాయి లాభం కోసమే వ్యాపారం పెట్టుకుంటారని చెప్పారు. కానీ రిలయెన్స్, ఫ్యూచర్ గ్రూప్లు మాత్రం ఏ లాభాపేక్ష లేకుండా చంద్రన్న విలేజ్ మాల్స్లో ఎలా జత కలిశాయని రోజా ప్రశ్నించారు. రేషన్ షాపు నుంచి 9 రకాల సరుకులను ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. పేదవాడికి భారం తగ్గించాలంటే రేషన్ షాపులు ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. కానీ మీ వాటాలు (చంద్రబాబు కంపెనీ) ఉన్న ఫ్యూచర్ గ్రూప్, రిలయెన్స్ వంటి సంస్థలకు ఇస్తే లాభం లేదన్నారు.

హెరిటేజ్ సంస్థలో ఎవరూ కొనరని ధరలు తగ్గించడం లేదు
నిజంగానే పేదవాడిపై చిత్తశుద్ధి ఉంటే నిత్యావసర ధరలు తగ్గించాలని రోజా డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో ధరలు తగ్గితే హెరిటేజ్ సంస్థలో ఎవరూ కొనరని చంద్రబాబుకు తెలుసు అన్నారు. అందకే ధరలు తగ్గించే విషయమై చిత్తశుద్ధి చూపించరన్నారు. నేను, నా కొడుకు, నా భార్య, నా కోడలు బాగుంటే చాలన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు.

చంద్రబాబు నీ తండ్రి ఆస్తిలో వాటా ఇస్తున్నావా
ఇప్పుడు చేస్తున్నదంతా హెరిటేజ్ సంస్థకు లాభాల కోసం చేస్తున్న కుట్ర అని రోజా అన్నారు. చంద్రబాబు దోపిడీకి ఎలా తెరతీసారో నేను కొన్ని ఉదాహరణలు చెబుతానని చెప్పారు. 21 ప్రభుత్వ పథకాలకు చంద్రబాబు పేరే పెట్టుకున్నారని చెప్పారు. ఈయన తండ్రి ఖర్జూర నాయుడు ఆస్తిలో వాటాను ప్రజలకు ఏమైనా ఇస్తున్నారా అని ప్రశ్నించారు. మన్నన పొందిన ఎన్టీఆర్, వైయస్సార్, ఇందిరా గాంధీ వంటి పేర్లు పెట్టుకోవాలన్నారు.

చంద్రబాబు దారుణాలు ఇవీ
నెయ్యి కాంట్రాక్ట్ను హెరిటేజ్కు ఇచ్చారని రోజా విమర్శించారు. వేసవిలో జనానికి సరఫరా చేసే మజ్జిగకు హెరిటేజ్ పెరుగును వాడాలని చెప్పారన్నారు. చంద్రబాబు తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారన్నారు. చంద్రబాబు వెంటనే ఈ కార్పోరేట్ దోపిడీకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. రేషన్ షాపుల్లో అన్ని వస్తువులు ఇవ్వాలన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు.

చంద్రబాబూ! తరిమి కొడతాం
కానీ, ఇలా దోపిడీకి పాల్పడితే మాత్రం ప్రజలు, మేం కలిసి చంద్రబాబును తరిమి కొడతామని రోజా హెచ్చరించారు. చంద్రబాబు ఆస్తి ఇటీవలి కాలంలో ఐదు రెట్లు పెరిగిందని మండిపడ్డారు. రాజకీయ అవగాహన లేదని, ప్రజలపై అభిమానం లేని లోకేష్ను మంత్రిగా చేసినప్పటి నుంచి మొదలు మనం దోపిడీ చూస్తున్నామన్నారు. రాష్ట్రం గురించి తెలియని వారికి మంత్రి పదవి ఇస్తే ఇలాగే ఉంటుందన్నారు. పట్టిసీమలో రూ.300 కోట్లు దోచుకున్నారని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications