అతను సీఎం సన్నిహితుడు, గడ్డి తింటున్నారా: రోజా, చంద్రబాబు-డీజీపీ కాల్ డేటా రావాలి: ఆర్కే
చిత్తూరు: తమ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కత్తి దాడి మీద తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు చేయడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేబినెట్ మంత్రులు కడుపుకు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అని ప్రశ్నించారు.
బాబుపై డౌట్, జగన్ని లేకుండా చేస్తే అలా అవుతుందనే, సెల్యూట్ చేస్తా: మేకపాటి
జగన్ పైన హత్యాయత్నం జరిగితే వెటకారంగా, స్టుపిడ్గా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక తప్పు జరిగితే ఆ తప్పు వెనుక ఉన్న నేరస్తుడిని పట్టుకొని శిక్షంచకుండా ఆ తప్పు ఎవరి మీద నెట్టివేయాలనే, ఎలా తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
హోటల్లో కత్తి ఉంటే ఏం చేస్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ప్రెస్ మీట్లు చూస్తుంటే అధికారులను ఏ విధంగా వాడుకుంటున్నాడో అర్థమవుతోందని రోజా ఆరోపించారు. చంద్రబాబు చెబుతోన్న ప్రతి మాట అబద్దమని నిరూపితం అవుతోందని చెప్పారు. కత్తి జనవరి నుంచి హోటల్లో ఉందని చెబుతున్నారని, అప్పటి నుంచి హోటల్ యజమాని హర్షవర్ధన్ చౌదరి ఏం చేస్తున్నారని నిలదీశారు.
అతను చంద్రబాబుకు సన్నిహితుడు
హర్షవర్ధన్ మంత్రి నారా లోకేష్కు, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడని రోజా అన్నారు. జగన్ను అంతమొందించేందుకు ఇది టీడీపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ గురించి చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆపరేషన్ గరుడ అంటూ మాట్లాడుతున్న శివాజీని అరెస్టు చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ గరుడ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో వెలికి తీయాలన్నారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల హస్తం
జగన్ హత్యాయత్నం కేసు నుంచి టీడీపీ పెద్దలను కాపాడేందుకు డీజీపీ, ఇంటెలిజెన్స్ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. ఈ ఘటన వెనుక చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. జగన్ పైన జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపితే తమపై కేసులు నమోదు చేశారన్నారు.
చంద్రబాబు, డీజీపీ కాల్ డేటా బయటపెట్టాలి
జగన్ పైన హత్యాయత్నం జరగకముందు, జరిగిన తర్వాత, జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఇంటిలిజెన్స్ చీప్ వెంకటేశ్వర రావు, డీజీపీ ఠాకూర్ కాల్ డేటాలను బయటపెట్టాలని ఆర్కే డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు.