మోడీ ప్రధాని అవుతారని బాబు ఊహించలేదు, అశోక్ సీఎం కాలేదే: రోజా
నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఏపీ సీఎం చంద్రబాబు ఊహించి ఉండరని, అందుకే గోద్రా అల్లర్ల విషయంలో ఆనాడు విమర్శలు చేశారని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని ఏపీ సీఎం చంద్రబాబు ఊహించి ఉండరని, అందుకే గోద్రా అల్లర్ల విషయంలో ఆనాడు విమర్శలు చేశారని వైసిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.
విజయమ్మతో అఖిలప్రియ భేటీ అయ్యారా?
ప్రత్యేక హోదాపై నారా చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఏపీకి పదేళ్ల పాటు హోదా కావాలన్ని చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబుది కప్పదాటు వైఖరి అన్నారు.
విశాఖ భూదందా నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాస రావును తప్పించాలని రోజా డిమాండ్ చేశారు. హోదాపై హామీ ఇచ్చి వెనక్కి తగ్గినప్పుడు ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్లతో ఎందుకు ప్రచారం చేయించారని ప్రశ్నించారు. హోదాతో లాభం లేకుంటే అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయించారని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారన్నారు.
మోడీని డైరెక్టుగా అనొచ్చు
మోడీ ఏపీకి వస్తే ఉరితీస్తామని నాడు చంద్రబాబు అన్నారని, ఇప్పుడేమో ఆయన కాళ్లు పట్టుకున్నారన్నారు. తాను సీనియర్ అని చెబుతూ.. చంద్రబాబు ప్రధానిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోడీని ఏదైనా అనాలనుకుంటే నేరుగా అనాలని, ఇండైరెక్టుగా ఎందుకని ప్రశ్నించారు.
అడ్డంగా దొరికిపోయాడు
హోదాను మించిన ప్యాకేజీ ఇస్తున్నామని చెబుతున్నారని, కానీ హోదా వేరు, ప్యాకేజీ వేరు అన్నారు. ఈ రెండూ ఇస్తేనే ఛిన్నాభిన్నం అయిన ఏపీకి న్యాయం జరుగుతుందన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం హోదాను పక్కన పెట్టారన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడని రోజా ఆరోపించారు. ఈ కేసు నుంచి కాపాడుకునేందుకు చంద్రబాబు దానిని పక్కన పెట్టారన్నారు. జగన్ మాత్రం ఢిల్లీస్థాయి వరకు హోదాను తీసుకు వెళ్లారని చెప్పారు.
జగన్ పోరాడుతున్నారు
అప్పుడు హోదా కావాలన్న చంద్రబాబు, ఇప్పుడు హోదాతో ఏం లాభం అని చెబుతున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలన్నారు. హోదా కోసం జగన్ మూడేళ్లుగా పోరాటాలు, దీక్షలు చేస్తున్నారన్నారు.
తప్పుడు లెక్కలు
వృద్ధి రేటుపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోందని అభిప్రాయపడ్డారు. వినేవాడు వెర్రివాడు అయితే, చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లుగా ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు అన్నారు. విశాఖ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద భూకబ్జా అన్నారు.
అశోక్ గజపతి రాజు సీఎం ఎందుకు కాలేదు
నేను రాజకీయాల్లో సీనియర్ను అంటూ చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని రోజా అన్నారు. రాజకీయాల్లో సీనియార్టీ ముఖ్యం కాదని, సిన్సియారిటీ ముఖ్యమన్నారు. పార్టీలో అశోక్ గజపతి రాజు.. బాబు కంటే సీనియర్ అని, ఆయన ఎందుకు సీఎం కాలేదన్నారు.
చంద్రబాబును వదిలేది లేదు
చంద్రబాబు లాంటి నాయకులు అవినీతిలో సీనియర్ అన్నారు. ఇలాంటి వారు వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. చంద్రబాబు లేని వృద్ధి రేటును చూపిస్తూ ఏపీ వారి జీవితం ప్రశ్నార్థకం చేస్తున్నారని, ఇలా చేస్తే చంద్రబాబును వదిలి పెట్టేది లేదన్నారు.