అయ్యన్నపాత్రుడు, చంద్రబాబుకు రోజా షాకింగ్ కౌంటర్.. ఇంకా ఏం పీకాలని ప్రశ్న
టిడిపి అధినేత చంద్రబాబు ఇంటిని వైసీపీ నాయకులు ముట్టడించటంతో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన దాడులతో, పోలీసుల లాఠీ చార్జ్ తో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ప్రస్తుతం టిడిపి వైసిపి నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది.

ఇంకా చల్లారని అయ్యన్న వ్యాఖ్యల కాక
కోడెల శివప్రసాద్ వర్ధంతి సందర్భంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ అయ్యన్నపాత్రుడు ఘాటుగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎమ్మెల్యే జోగి రమేష్ మాజీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించి మరీ చంద్రబాబు ఇంటిని ముట్టడించారు. ఇక చంద్రబాబు ఇంటిదగ్గర కృష్ణానది కరకట్ట మీద వైసీపీ టీడీపీ నేతల మధ్య కర్రల యుద్ధం జరిగింది. రెండు పార్టీల నేతలకు మధ్య జరిగిన బాహాబాహీతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను శాంతింప చేశారు. అయినా నిన్నటి నుండి టిడిపి, వైఎస్సార్సీపీ నేతల మధ్య ఈ దాడికి సంబంధించి మాటల దాడి కొనసాగుతోంది. పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తుంది.

జగన్ కావాలని చంద్రబాబు ఇంటిపై దాడి చేయించారని టీడీపీ ఆరోపణ
వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేదని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు. జగన్ కావాలని చంద్రబాబు ఇంటిపై దాడికి పురిగొల్పారని విమర్శిస్తున్నారు. జోగి రమేష్ ముందే ముట్టడి చేస్తామని హెచ్చరించినా కావాలనే పోలీసులు పట్టించుకోలేదని, ఇది ప్లాన్డ్ గా ప్రభుత్వం చేయించిన దాడి అని విమర్శల జల్లు కురిపిస్తున్నారు.

కోడెలకు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రోజు అయ్యన్న ఏం చేశారు ? రోజా ప్రశ్న
వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా టిడిపి నేతలను, చంద్రబాబును టార్గెట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రోజా వ్యాఖ్యానించారు . ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పిన రోజా ఇప్పుడు కోడెల గురించి మాట్లాడుతున్న అయ్యన్నపాత్రుడు, నాడు చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని రోజు ఏం చేశారు అంటూ ధ్వజమెత్తారు.

సీఎం అంటే ఎలా ఉండాలో జగన్ ను చూసి నేర్చుకోవాలన్న రోజా
ఇక ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని రోజా హితవు పలికారు. ఇటీవల టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చిన రోజా ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించాలని చిరంజీవి నాగార్జున కోరడంతో జగన్ అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగానే బెల్టుషాపులను తొలగించడమే కాకుండా, 33 శాతం మద్యం దుకాణాలు ఎత్తి వేశారని రోజా పేర్కొన్నారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పీకేశారు అని పేర్కొన్న రోజా, గత ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవిని కూడా పీకేశారు అన్నారు.
Recommended Video

ఇంకా ఏం పీకాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన రోజా
అడ్డదారిన మంత్రి నారా లోకేష్ పదవిని పీకేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారు అని ఇంకా ఏం పీకాలని ఎమ్మెల్యే రోజా ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దండయాత్రకు దిగారు. జగన్ పై అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే రోజా చంద్రబాబు టిడిపి నేతలపై తనదైన శైలిలో ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications