గుట్టు విప్పేదెవరు: జగన్, చంద్రబాబులవి ఇంద్రభవనాలేనా?
జగన్, చంద్రబాబుల ఇళ్లలోకి అడుగు పెట్టినవారెవరూ అసలు విషయాలు చెప్పరు. దాడులు, ఎదురుదాడులు మాత్రమే జరుగుతుంటాయి...
విజయవాడ: తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాదులో నిర్మించుకున్న ఇంటిపై వివాదం చెలరేగుతోంది. గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బెంగళూరులో కట్టుకున్న ఇంటిపై కూడా ఇలాంటి వివాదమే నడిచింది. ప్రస్తుతం దాడి, ఎదురుదాడుల కథ రసవత్తరంగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ప్రధాన ప్రతిపక్షనాయకుడైన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించుకున్న సౌధాలలో అద్భుతాలేవో ఉన్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
అది ప్రచారం అనే కన్నా దాడి, ఎదురుదాడులకు సంబంధించిన వ్యవహారమని అనవచ్చు. గత ఎన్నికల ముందు జగన్కు బెంగళూరు ప్యాలెస్లో ఉన్న భవనాలను తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా నిర్వాహకులు కలర్ ఫొటోలతో ఉంచి విడుదల చేశారు. ఇప్పుడు చంద్రబాబుకు చెందిన భవనం ఫొటో ఒక్కటి మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెసు నాయకులు చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

జగన్ బెంగళూరు ప్యాలెస్లో ఇవన్నీ...
జగన్ కర్నాటక రాజధాని బెంగళూరులో నిర్మించుకున్న అత్యాధునిక సౌధంలో 70 గదులు, రెండు హెలిపాడ్లు, 3 స్విమింగ్పూల్స్, 10 లిఫ్టులు, 200 మంది కూర్చునే 2 మినీ థియేటర్లు, ఒక ఎస్కలేటర్ ఉన్నాయని ప్రచారం సాగింది. చంద్రబాబుకు అన్ని అనుమతులతో కూడిన 8 గదులు, మినీ థియేటర్ కూడా లేదని అప్పట్లో వ్యాఖ్యానించారు.
దానిపై అప్పట్లో పెద్ద రచ్చలాంటి చర్చనే జరిగింది.

దోచుకున్న డబ్బుతోనే కట్టారని...
జగన్కు అంత డబ్బెక్కడిదని తెలుగుదేశం నాయకులు ప్రశ్నిస్తూ దోచుకున్న డబ్బుతోనే బెంగళూరు, హైదరాబాద్ లోటస్పాండ్లో ఇంద్రభవనాలు కట్టారని విమర్శలు చేశారు. అప్పట్లో ఎంపిగా ఉన్న కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఒక అడుగుముందుకువేసి, బెంగళూరులోని జగన్ భవనాన్ని తన నియోజకవర్గ ప్రజలతోపాటు మరికొందరిని తీసుకువెళ్లి మరీ చూపించారు. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కథ రివర్సయింది.

గత ఆదివారంనాడు చంద్రబాబు ఇల్లు...
గత ఆదివారం చంద్రబాబునాయుడు హైదరాబాద్లోని తన పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మించుకుని, గృహప్రవేశం చేశారు. ఆయన ఇంట్లో అత్యంత ఖరీదైన పరికరాలున్నాయని, బంగారు, వెండి తాపడాలతో వస్తువులున్నాయని, ఖరీదైన లాన్లు, షాండిలర్లు ఉన్నాయనే సోషల్ మీడియాలో ప్రచారం సాగుతూ వచ్చింది. గతంలో జగన్ ఇంటిపై టిడిపి ఎలాంటి ప్రచారం చేసిందో, ఇప్పుడు జగన్ పార్టీ కూడా బాబు ఇంటిపై అదే ప్రచారం ప్రారంభించడం గమనించాల్సిన విషయం.

తనకు వాచీ కూడా లేదని...
తన చేతికి వాచీ కూడా లేదని, జేబులో డబ్బులు కూడా ఉండవని, తాను సాదాసీదా జీవనం గడుపుతానని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. దాన్ని ప్రస్తావిస్తూ - విదేశాల్లో ఉండే ఇంధ్ర భవనం లాంటి ఇల్లు ఎక్కడ నుంచి వచ్చిందనే ప్రశ్నలు వేస్తూ ఇంటి ఫోటోలను కింద ఉంచారు. వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డి, రోజా వంటి నేతలు మరో అడుగు ముందుకు వేసి అమరావతి భూములు, ఇతర కుంభకోణాల్లో సంపాదించిన అక్రమార్జనతో ఆ ఇంధ్రభవనం కట్టారని ఆరోపించారు. భవనం లోపల సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఖరీదైనవి లేకపోతే, ఇతరులను గృహప్రవేశానికి ఎందుకు పిలవలేదని కూడా అడిగారు.

ఆ ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు...
ప్రచారాన్ని తిప్పికొట్టడానికి - సోషల్మీడియాలో చంద్రబాబు నివాసంపై వస్తున్న కట్టుకథల ఫొటోలపై విచారణ జరిపి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా టిడిపి లీగల్సెల్ తాజాగా విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తారా... ఏమో...

వాటిని చూపించవచ్చు కదా...
చంద్రబాబు, జగన్ ఇంద్రభవనాల హంగులను, అందాలను సోషల్మీడియాలో చూడటమే తప్ప ఇంతవరకూ వాటిని దగ్గరనుంచి చూసినవారు ఎవరో తెలియదు. సామాన్యులకు మాత్రం ఆ విషయాలు ఏ మాత్రం తెలియదు. ఆ స్థితిలో వారు స్పందించి కనీసం మీడియా ప్రతినిధులకైనా వాటిని చూపించవచ్చు కదా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఆ భవనాల్లోకి ప్రవేశం ఉన్న మీడియా ప్రతినిధులైనా అసలు విషయం చెప్పారా అంటే అదీ లేదు. వారి వారి భవనాల్లోకి బహుశా వారికి అత్యంత ఆత్మీయులు, విశ్వాసపాత్రులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.












Click it and Unblock the Notifications