నెహ్రూ జూపార్కులో రాయల్ బెంగాల్ టైగర్ దత్తత(ఫొటో)
హైదరాబాద్: పుష్ప్ కుమార్(రాయల్ బెంగాల్ టైగర్)ను ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ దేశ్పాండే మనుమడు మాస్టర్ శ్రియన్ మంగళవారం దత్తత తీసుకున్నారు. తన మనుమడు శ్రియన్ తోపాటు నగరంలోని నెహ్రూ జూ పార్క్కు వచ్చిన ఆయన, నాలుగేళ్ల రాయల్ బెంగల్ టైగర్ను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.
రూ. 25,000ల చెక్కును జూ పార్క్ అదనపు పిసిసిఎఫ్, డైరెక్టర్ మల్లిఖార్జున రావు(ఐఎఫ్ఎస్)కు అందజేశారు. ఈ దత్తత మూడు నెలలపాటు కొనసాగనుంది. దేశ్పాండే పులిని వరుసగా దత్తత తీసుకోవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.
తన మనుమడు పుట్టిన ఏడాది నుంచి అతని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం అదే పులిని దత్తత తీసుకుంటున్నట్లు దేశ్పాండే తెలిపారు. నెహ్రూ జూ పార్క్ చాలా బాగుందని చెప్పారు.
దేశ్పాండే లాగే పలువురు జూలోని జంతువులను దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని జూ అధికారి మల్లిఖార్జున రావు తెలిపారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూ పార్క్ అసిస్టెంట్ క్యూరేటర్ సయ్యద్ మసూద్ మొహినుద్దీన్, విఏఎస్ శ్రీనివాస్ రెడ్డి, బాలస్వామి, పిఆర్ఓ, జడ్ఈఓ హెచ్ఎం హనీఫుల్లా పాల్గొన్నారు.