మోడీ ప్యాకేజీకి ఓ లెక్కుంది: ఇక మేడిన్ చైనా వస్తువులకు బ్రేక్: డ్రాగన్ వెన్ను విరిచే స్కెచ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ వెనుక పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు దేశీయ పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం.. ఇటు చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టేలా ఉంది. ఇదివరకు ఎప్పుడూ లేనంతగా దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా చైనా నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించాలనేది నరేంద్ర మోడీ అనుసరిస్తోన్న తాజా వ్యూహమని చెబుతున్నారు.
Recommended Video
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో..
కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి అవకాశాలను వెదుక్కునే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంక్షోభ సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడం అంటే మాటలు కాదు. అసలే 50 రోజులుగా కొనసాగుతోన్న లాక్డౌన్ నేపథ్యంలో క్రయ, విక్రయాలు లేకపోవడం వల్ల ఖజానాకు రావాల్సిన రాబడి స్తంభించిపోయింది. అంతకుముందే ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోన్న కేంద్ర ప్రభుత్వంపై తాజాగా కరోనా వైరస్ రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చినప్పటికీ.. చెక్కుచెదరలేదు.
దేశీయ తయారీ రంగానికి ఊతం..
అదే సమయంలో 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని తెర మీదికి తీసుకుని రావడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. ఆత్మనిర్భర్ అభియాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రధానంగా వ్యవసాయం, దేశీయ ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడానికేనని ప్రధానమంత్రి తన ప్రసంగంలో స్పష్టంగా తెలియజేశారు. వోకల్ ఫర్ లోకల్ నినాదానికి అనుగుణంగా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేస్తామనీ చెప్పారు.
రెండు రకాలుగా మేలు..
ఈ ఆర్థిక ప్యాకేజీ వల్ల రెండురకాలుగా మేలు కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. లాక్డౌన్ వల్ల మూతపడిన దేశీయ తయారీ రంగానికి ఈ ప్యాకేజీ ఊపిరి ఊదే అవకాశాలు లేకపోలేదు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను లాక్డౌన్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఉపయోగపడుతుంది. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల పొరుగు దేశాల నుంచి భారత్కు దిగుమతి అవుతోన్న వస్తువులను నియంత్రించడానికీ ఈ ప్యాకేజీ ఉపకరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
చైనా వస్తువులకు ఇక అడ్డుకట్టే..
దేశీయ తయారీ రంగానికి ప్రోత్సాహకాలను అందించడం వల్ల చైనా వస్తువుల దిగుమతిని నియంత్రించడం సాధ్యపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాంటి గ్యారంటీ లేకపోయినప్పటికీ.. చవగ్గా లభిస్తుండటం వల్ల చైనా వస్తువులు మన దేశీయ మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరాణాలు..ఇలా దాదాపు అన్ని రకాల చైనాకు చెందిన వస్తువులు మనకు అందుబాటులో ఉంటున్నాయి. మనం నిత్యం వాటిని వాడుకుంటున్నాం కూడా.
చైనా వస్తువులను బాయ్కాట్ చేయాలంటూ..
భారత్పై తరచూ విషం చిమ్ముతూ కనిపించే చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ మనదేశంలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గానీ, దాని అనుబంధ హిందూ సంఘాలు గానీ ఎప్పటి నుంచో ఈ పిలుపు ఇస్తున్నాయి. అయినప్పటికీ..దాదాపుగా అది సాధ్యం కాలేదు. చైనా వస్తువులు మన దైనందిన జీవితంలో భాగం కావడం, వాటికి ప్రత్యామ్నాయంగా దేశీయ తయారీ అందుబాటులో లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో చైనా వస్తువులను వినియోగించుకోవాల్సి వస్తోంది.
వోకల్ ఫర్ లోకల్ నినాదం అందుకే..
చైనా వస్తువులను బాయ్కాట్ చేయడానికి ఇదే సరైన సమయమని నరేంద్ర మోడీ భావించి ఉండవచ్చని అంటున్నారు. కరోనా వైరస్ చైనా నుంచే పుట్టుకుని రావడం, ఈ మహమ్మారి కల్లోలాన్ని రేపుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ సరిహద్దుల్లో ఘర్షణపూరక వాతావరణాన్ని సృష్టించడం, భారత భూభాగంపైని చొచ్చుకుని రావడం వంటి తెంపరితనాన్ని చైనా ప్రదర్శిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించి, చైనా వస్తువుల దిగుమతిను నియంత్రించడం ద్వారా దాని దూకుడుకు అడ్డుకట్ట వేయవచ్చని మోడీ వ్యూహంగా చెబుతున్నారు.