ఓటీఎస్ పై సజ్జల క్లారిటీ: ప్రజలకు మేలు చేస్తున్నా తప్పుపడితే ఎలా అంటూ ప్రతిపక్షాలకు ప్రశ్న
ఓటీఎస్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్రభుత్వం పదేపదే సమాధానం చెప్తూనే ఉంది. తాము బలవంతంగా ఓటీఎస్ కట్టమని ప్రజలను ఇబ్బంది పెట్టటం లేదని పదేపదే చెప్తుంది. ప్రజలు స్వచ్చందంగానే ఓటీఎస్ చెల్లిస్తున్నారని చెప్తుంది. ప్రధానంగా టీడీపీ ఎవరూ ఓటీఎస్ కట్టొద్దు అని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. వైసీపీని వన్ టైం సెటిల్మెంట్ ఎందుకు కట్టాలంటూ నిలదీస్తుంది టీడీపీ.

ఓటీఎస్ పై పదేపదే క్లారిటీ ఇస్తున్న వైసీపీ సర్కార్
ఇక ఈ క్రమంలో టీడీపీతో పాటు ప్రతిపక్షాల విమర్శలకు వైసీపీ నేతలు సమాధానం చెప్తూనే ఉన్నారు. ఇక ఏకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చారు. పేదలకు మంచి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్న సీఎం జగన్ ఓటీఎస్ పథకం పూర్తిగా స్వచ్చందం అని, ప్రజలకు దీనిపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. పదివేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని వెల్లడించారు. ఇక తాజాగా వైయస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓటిఎస్ పై క్లారిటీ ఇచ్చారు.

ఎల్లో మీడియా దుష్ప్రచారం అని మండిపడుతున్న సజ్జల
ఓటిఎస్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కావాలని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని విరుచుకుపడ్డారు. అబద్ధాలు, వితండ వాదంతో కథనాలు ఇస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.ఇక ఇదే సమయంలో ఓటిఎస్ పై ఎవరినీ బలవంతపెట్టేది లేదని, ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం అంటూ తేల్చి చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా తప్పు పడితే ఎలా? అంటూ ప్రశ్న
ప్రజలకు ఇష్టమైతేనే ఓటిఎస్ ను వినియోగించుకోవచ్చని ఆయన తేల్చి చెప్పారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పేరుతో స్కామ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి టిడిపి హయాంలో పేదలకు ఇళ్లు కూడా ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ఇప్పటి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నా తప్పు పడితే ఎలా అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ టి ఎస్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ లతో ప్రజలపై ఆరు వేల కోట్ల రూపాయల భారం పడకుండా చేస్తున్నామని రామకృష్ణ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ఓటీఎస్ తో దారుణంగా బలవంతలు వసూళ్లు అంటూ మండిపడిన పట్టాభి
ఇదిలా ఉంటే ఓటిఎస్ పేరుతో కాల్ మనీ వ్యాపారుల కంటే దారుణంగా జగన్ రెడ్డి ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. నిత్యం వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ నేత పట్టాభి ఇది ఓ టి ఎస్ కాదని ఇది జెటిఎస్ అంటూ పేర్కొన్నారు. ఇది జగన్ టోకరా స్కీమ్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తాజా కాగ్ నివేదికను పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వెల్లడైందని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదల ఇళ్ల నిర్మాణం కోసం వివిధ పథకాల కింద విడుదలైన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించినట్లు సి ఏ జి నివేదికలో స్పష్టంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నుండి దోపిడీ మొదలు పెట్టారని పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications