ఈ సమస్యంతా చంద్రబాబు వల్లే .. కేసీఆర్ ఢిల్లీ వెళ్ళినా న్యాయం మా వైపే ..మరోమారు సజ్జల హాట్ కామెంట్స్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీ,తెలంగాణ రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై కేంద్రానికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కు వాదనలు వినిపిస్తామని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించే మీటింగ్ కు వచ్చి తెలంగాణ తమ వాదన వినిపిస్తే బాగుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రం కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కృష్ణా రివర్ బోర్డుకు కనిపించటం లేదా ?
సీఎం కేసీఆర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వహించే సమావేశాన్ని వదిలిపెట్టి ఢిల్లీకి వెళితే ఏమవుతుంది అంటూ ప్రశ్నించిన సజ్జల రామకృష్ణారెడ్డి, కృష్ణా రివర్ బోర్డు ముందు వాదనలు వినిపిస్తే సమస్య ఇక్కడే పరిష్కారం అయ్యేది కదా అంటూ పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తమకు రావాల్సిన న్యాయబద్ధమైన హక్కు కోసమే కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళింది అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని పేర్కొన్న సజ్జల, తెలంగాణ రాష్ట్రం కడుతున్న అక్రమ ప్రాజెక్టులు కృష్ణా రివర్ బోర్డుకు కనిపించడం లేదా అంటూ నిప్పులు చెరిగారు.
ఈ సమస్య అంతా చంద్రబాబు వల్లే వచ్చిందన్న సజ్జల
విద్యుత్ ఉత్పత్తి పేరుతో అక్రమంగా నీటిని వృధా చేస్తున్నారని ఆరోపించిన సజ్జల రామకృష్ణారెడ్డి కృష్ణా జలాల్లో తెలంగాణ సగం వాటా అడగటం అసంబద్ధం అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. విభజన సమయంలో నీటి వాటాలు కేటాయించారని గుర్తు చేశారు. ఇక ఈ సమస్య అంతా చంద్రబాబు వల్లే వచ్చిందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాజెక్టులపై మాట్లాడి ఉంటే ఈరోజు ఈ సమస్య వచ్చేది కాదని నిప్పులు చెరిగారు.
అప్పుడు సమస్య పరిష్కరించలేక పారిపోయి ఇప్పుడు విమర్శలా ?
నాడు సమస్యను పరిష్కరించలేక పారిపోయిన చంద్రబాబు, ఇప్పుడు వచ్చి సీఎంని విమర్శించడం ఏమిటి అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు విమర్శలు అర్థరహితమని మండిపడ్డారు. కృష్ణా జలాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.ఇటీవల జలవివాదాల నేపధ్యంలో ఏపీ సర్కార్ పై అటు తెలంగాణా నేతలు , మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా ఏపీ మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు నిప్పులు చెరుగుతున్న సమయంలో చంద్రబాబు వల్లే ఇదంతా అంటూ సజ్జలతో పాత్రు మంత్రులు కూడా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు.