బెజవాడ కనక దుర్గమ్మ ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలు..
బెజవాడ అనగానే టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు కనకదుర్గమ్మ ఆలయం.. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.. అందుకే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య నిత్యం రద్దీగానే ఉంటుంది. ఇక, పండుగుల, ఉత్సవాల సందర్భంలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భక్తులు బారులు తీరుతారు. విజయవాడ వెళ్లినవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే. అంతటి మహిమగల ఆలయం ఇది. ఇక, ఈ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు ఆకుకూరలు, కూరగాయలుతో ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీ.
ఈ శాకంబరి దేవి ఉత్సవాలు మూడురోజులపాటు జరుగుతాయి. ఇక, ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి రాజగోపురంతో పాటు అమ్మవారి అలంకరణలు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ఈ శాకంబరీ ఉత్సవాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడమే కాకుండా ఈ ఉత్సవాల ఆలంకరణకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలను కూడా విరాళంగా అందించారు. భక్తులు విరాళంగా ఇచ్చిన కూరగాయలతో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా పూజ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు శాకంబరీదేవిగా దర్శనమిస్తోంది. ఆలయంలోని ఒక్క అమ్మవారు మాత్రమే కాకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలను సైతం కూరగాయలు, ఫలాలతో అలంకరించారు.

దేవతామూర్తుల ప్రతిమలు కూడా ...
ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఓ కారణం ఉంది. అదేంటంటే.. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి, ప్రజలు, రైతులు సుఖ-శాంతులు, సంతోషాలతో జీవించేందుకు అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇంద్రకీలాద్రి క్యూలైన్లలను కూడా కాయగూరలతో అలంకరించారు. రాజగోపురం మహామండపంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను కూడా కూరగాయాలతో అలంకరించారు. ఇంద్రకీలాద్రిపై అంతరాయం వెలుపల కూరగాయలతో అలంకరణ చేశారు. ఇక, శివలింగంపై నాగేంద్రుడి పడగ ఆకారంలో కూరగాయలతో చేసిన అలంకరణ భక్తులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. మహామండపంలో కూరగాయలతో చేసిన దేవతామూర్తుల ప్రతిమలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications