షాక్: బీజేపీలో చేరిన అశోక్ గజపతి రాజు సోదరుడి కూతురు, ఎవరీ సంచిత?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతి రాజు, మాజీ ఎంపీ ఉమా గజపతి రాజుల కూతురు, విజయనగర మహారాజు పీవిజి రాజుగారి మనవరాలు సంచితా గజపతి రాజు భారతీయ జనతా పార్టీలో చేరారు.
జనసేనలోకి క్లాస్మేట్స్: అమ్మాయి నుంచి రూ.11 తీసుకున్న పవన్ కళ్యాణ్, ఎందుకంటే?
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఆధ్వర్యంలో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, విశాఖ ఎంపీ హరిబాబు, సీనియర్ నేతలు విష్ణు కుమార్ రాజు తదితరుల సమక్షంలో సంచిత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు పార్టీ నేతలు తెలియజేశారు.
ఏపీ బీజేపీ ట్వీట్
ఈ మేరకు ఏపీ బీజేపీ ట్వీట్ చేసింది. 'బీజేపీ అధ్యక్షులు అమిత్ షా సమక్షంలో, బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విజయనగర మహారాజు కీ.శే.పి.వి.జి రాజుగారి మనవరాలు, ఉమా గజపతిరాజు గారి కుమార్తె సంచిత బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో హరిబాబు, పురంధేశ్వరి, ఇతర పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు' అని ట్వీట్ చేసింది. బీజేపీలోకి స్వాగతిస్తూ పలువురు ట్వీట్ చేశారు. అందుకు సంచిత థ్యాంక్స్ చెప్పారు.
అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు. ఈ ఆనంద గజపతి రాజు కూతురు సంచిత. ఆనంద గజపతి రాజు... ఎన్టీఆర్ కేబినెట్లో మినిస్టర్గా పని చేశారు. కొంతకాలం కాంగ్రెస్ పార్టీతో కూడా పని చేశారు. అశోక్ గజపతి రాజు జనతా పార్టీ నుంచి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చారు.
గజపతి రాజు కుటుంబం నుంచి బీజేపీలోకి మొదటిసారి
గజపతి రాజు కుటుంబం నుంచి ఓ వ్యక్తి బీజేపీలో చేరడం ఇది మొదటిసారి. సంచిత ఓ ఎన్జీవోను రన్ చేస్తున్నారు. సోషల్ అవేర్నెస్ న్యూయర్ ఆల్టర్నెటివ్స్ (ఎస్ఏఎన్ఏ) పేరుతో దీనిని రన్ చేస్తున్నారు. తూర్పు గోదావరి, విశాఖపట్నంలలో ఆమె ఎంతోమందికి తెలుసు.
ఏపీపై బీజేపీ దృష్టి
కాగా, నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీలో ఆశించిన స్థాయిలో బలపడకపోవడంపై బీజేపీ అగ్ర నేతలు దృష్టి సారించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లు సోమవారం ఢిల్లీలో రాష్ట్ర నేతలతో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు. కన్నా లక్ష్మీనారాయణతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.