మరో చిచ్చు: ఎపి ఖాతాలు ఫ్రీజ్, కెసిఆర్పై గంటా ఫైర్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలిలో మరో వివాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఖాతాలను ఫ్రీజ్ చేయాల్సిందిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బిహెచ్)కు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో ఎస్బీహెచ్ అధికారులు ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాలను స్థంభింపజేశారు.
ఏపీ ఉన్నత విద్యా మండలి హైదరాబాద్ శాంతినగర్ ఎస్బిహెచ్ శాఖలో ఖాతాలు, ఫిక్స్డ్ డిఫాజిట్లు చేసింది. ఈ ఖాతాల్లో రూ. 25 కోట్లు ఉన్నాయి. అయితే బ్యాంకు ఖాతాలను స్థంభింప చేయడంపై ఏపీ ఉన్నత విద్యామండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఖాతాల స్తంభనపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎస్బిహెచ్పై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన తెలిపారు. కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రిగా కాకుండా ఉద్యమకారుడిగా వ్యవహరిస్తున్నారని ఆయన మీడియాతో అన్నారు. ఎంసెట్పై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎంసెట్ విడిగానే నిర్వహించుకుంటామని గంటా శ్రీనివాస రావు చెప్పారు. తెలంగాణ భారదేశంలో అంతర్భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని అడిగారు. ఎంసెట్ ఏ రాష్ట్రం నిర్వహించాలనే విషయంపై ఇప్పటికే వివాదం కొనసాగుతోంది. తాము విడిగా ఎంసెట్ నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.