మండు వేసవిలో చల్లని కబురు-వైజాగ్ వాసులకు సముద్రపు ఊరట- ఏపీ వెదర్ మ్యాన్ విశ్లేషణ
ఏపీలో ఈసారి వేసవి ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వడగాల్పుల ప్రభావం పెరుగుతోంది. కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు కూడా వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ విభాగాలు సూచిస్తున్నాయి. ఇంత వేడిలోనూ ఈ వేసవిలో విశాఖ నగరంపై ఈ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నాడు.
ప్రస్తుతం రాష్ట్రంలో వేసవి సీజన్ పతాకస్ధాయిలో ఉంది. ఉష్ణోగ్రతలు స్థాయిని మించి పెరుగుతున్నాయి. ఈ ఏడాది భారీగా ఎండలుఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్నారు. భారత్ లో ఈ ఏడాది 50 డిగ్రీలకు పైగా ఎండలు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి గల కారణాలుు కూడా వెల్లడించారు.
రాజస్థాన్ నుంచి వేడి, పొడి గాలులు దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాయని, దీంతో ఆంధ్రప్రదేశ్కు వడగాల్పుల ముప్పు పొంచి ఉందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు. ఈ వేడి గాలుల వల్ల ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పుడు ఏపీ వైపు ఇవి దూసుకుపోతున్నాయన్నారు. అదే సమయంలో ఈ వేసవిలో తీర ప్రాంత నగరం వైజాగ్లో వాతావరణంపైనా తన అంచనాలు వెల్లడించారు.
తీరప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలలో వేడి వాతావరణం ఉంటుందని వెదర్ మ్యాన్ సాయిప్రణీత్ తెలిపారు. సముద్రపు గాలి వేడి ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయన అంచనా వేశారు. వైజాగ్ తీరప్రాంతం వైపుగా వచ్చే వేడి గాలులకు సముద్రం నుంచి వచ్చే గాలి వాహకంగా పనిచేస్తుందని అన్నారు. మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఈ వేసవిలో వైజాగ్లో 40 డిగ్రీలకు కాస్త అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ అంచనా.
ఈ వేసవిలో రోజులు గడిచేకొద్దీ సముద్రపు గాలి పెందుర్తి, అనకాపల్లి, నర్సీపట్నం ప్రాంతాల వైపు మళ్లుతుందని వెదర్ మ్యాన్ అంచనా వేశారు. దీంతో పాటు వేడి కణాలను కూడా తీసుకువెళ్తుందన్నారు. దీని ఫలితంగా తీరప్రాంతానికి సమీపంలోని ప్రాంతాలతో పోలిస్తే ఆ ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, లంబసింగి చుట్టూ కొండలు ఉండి తేమ పేరుకుపోవడంతో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలపై ఏర్పడిన మేఘాలు నగరం వైపు కమ్ముకునే అవకాశం ఉన్నందున ఇది చివరికి వైజాగ్ పట్టణానికి అనుకూలంగా మారుతుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.