నా లక్ష్యమదే: బాబు, 20 ఎకరాల్లో సచివాలయం, రూ.లక్ష కోట్లు.. బొత్స తీవ్ర ఆరోపణ
అనంతపురం/అమరావతి: రాయలసీమను రతనాల సీమగా చేయటమే తన ముందు ఉన్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. అనంతపురంలో నీరు - చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. రాయలసీమ రతనాలసీమ అని అది ఇవాళ కరువు సీమగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువును చూసి భయపడాల్సిన పని లేదన్నారు. రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చెప్పారు.
అనంతపురంలో 550 మిల్లీ మీటర్ల వర్షపాతం పడుతోందన్నారు. కరువు నివారణకు చర్యలు చేపట్టామన్నారు. నదుల అనుసంధానం చేసుకోవాల్సి ఉందని చెప్పారు. భూమినే మనం జలాశయంగా మార్చుకుందామన్నారు. ఎక్కడికి అక్కడ చెక్ డ్యాంలు, చెరువులు నిర్మించుకుందామని చెప్పారు.

వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు. అనంతపురం హార్టికల్చర్ హబ్గా మారుతుందన్నారు. ఇబ్బందులు ఉన్నా రైతులను ఆదుకునే విషయంలో రాజీపడేది లేదన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.572 కోట్లు ఇచ్చామన్నారు.
రైతుల రుణమాఫీ కోసం రూ.24వేల కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నామన్నారు. పెట్టుబడి నిధి కింద రూ.716 కోట్లు ఇచ్చామని చెప్పారు. తాము నిరంతరం విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గాలంటే పేదలు అభివృద్ధి చెందాలన్నారు.
జన్మభూమిలో 12 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గాలన్నా, అభివృద్ధి చెందాలన్నా నీరు చాలా ముఖ్యమని చెప్పారు. నీరు ప్రగతికి మెట్టు అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల పైన గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
అంతకుముందు, శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నీరు-ప్రగతి కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీరు-ప్రగతి ప్రదర్శనశాలను గవర్నర్, ముఖ్యమంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వ రావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్, చీఫ్విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
20 ఎకరాల్లో ఏపీ సచివాలయం
అమరావతి టౌన్ షిప్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సీఆర్డీఏ చర్యలు చేపట్టేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇరవై ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టేందుకు జూన్ 30వ తేదీని డెడ్ లైన్గా విధించింది.
ఇందుకు రూ.180 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో వడ్డీలేని రుణం రూ.90కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన రూ.90కోట్లు హడ్కో నుంచి రుణం పొందాల్సిందిగా సూచించింది. వివిధ విభాగాలకు కేటాయించిన కార్యాలయ వసతి ఆధారంగా వారి సాధారణ బడ్జెట్ నుంచి అద్దెను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
దుర్వినియోగం: బొత్స
ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణంలో రూ.లక్షల కోట్ల ప్రజాధనం దర్వినియోగం అవుతోందన్నారు. తాత్కాలిక రాజధాని పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, టిడిపి దోపిడీ విధానాన్నే వ్యతిరేకిస్తున్నామన్నారు. సింగపూర్తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో లొసుగులు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు జరిగిన ఒప్పందాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఏ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. సామాన్యుల నుంచి సేకరించిన వేలాది ఎకరాల భూమిని సింగపూర్లోని ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేయడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications