అమ్మఒడిలో ల్యాప్ టాప్ లకు మంగళం-బైజూస్ ట్యాబ్ లతోనే సరి- జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకంలో ఈ ఏడాది పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన షరతులతో భారీగా లబ్దిదారులు ఈ పథకం అర్హత కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగా గతంలో ఇస్తామన్న ల్యాప్ టాప్ లు ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. దీంతో ఈ ఏడాది నుంచి బైజూస్ ఇచ్చే ట్యాబ్ లపైనే విద్యార్ధులు ఆధారపడాల్సిన పరిస్దితి.
అమ్మ ఒడి షాకులు
అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్ధులను స్కూళ్లకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తర్వాత అందులో నుంచి మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో వెయ్యి రూపాయలు కోతవిధించింది. ఆ తర్వాత నాడు-నేడు పనుల ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్న పేరుతో మరో వెయ్యి రూపాయలు తగ్గించింది. దీంతో ఈ ఏడాది నుంచి కేవలం రూ.13 వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో పడబోతున్నాయి. దీంతో అమ్మఒడి లబ్దిదారులకు వరుస షాక్ లు తప్పడం లేదు.
అమ్మఒడి ల్యాప్ టాప్ లు
అమ్మ ఒడి పథకంలో భాగంగా డబ్బులు తీసుకోని వారి కోసం ప్రభుత్వం ల్యాబ్ టాప్ లు ఇస్తామని గతంలో ప్రతిపాదించింది. ఈ మేరకు మాకు డబ్బులు వద్దు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవాలని లబ్దిదారుల్ని కోరింది. దీంతో 8 లక్షల మంది లబ్దిదారులు ల్యాప్ టాప్ లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ల్యాప్ టాప్ లు ఇవ్వలేమని చేతులెత్తేసింది. వీరికి కూడా అమ్మఒడి కింద డబ్బులు మాత్రమే ఖాతాల్లో వేస్తోంది. దీంతో తమకు ల్యాప్ టాప్ లు వస్తాయని ఆశలు పెట్టుకున్న లబ్దిదారులు నిరాశకు గురయ్యారు.
ఆర్ధిక భారమే కారణం
రాష్ట్రంలో గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా ల్యాప్ టాప్ లు ఇవ్వాలంటే ఒక్కో విద్యార్ధికి రూ.18 వేల చొప్పున ఖర్చుచేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కాంట్రాక్టర్ మాత్రం ఒక్కో ల్యాప్ టాప్ కు రూ.26 వేలు అవుతుందని అంచనాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వేస్తున్నది కేవలం 13 వేలు మాత్రమే. ఈ లెక్కన చూసుకుంటే విద్యార్ధులకు మరో ఏడాది పాటు అమ్మఒడి కింద డబ్బులు వేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ల్యాప్ టాప్ ల స్కీంకు మంగళం పాడింది.
బైజూస్ ట్యాబ్స్ తోనే సరి
మరోవైపు ప్రభుత్వం తాజాగా ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్రంలోని 8 వ తరగతి నుంచి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది 8వ తరగతి విద్యార్ధులకు సెప్టెంబర్ కల్లా ట్యాబ్ లు ఇవ్వనున్నారు. ఇలా 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ.12 వేలు ఖర్చయ్యే ట్యాబ్ లు ఇస్తారు. దీంతో అమ్మఒడి లో ల్యాప్ టాప్ లు దొరకలేదని భావించి నిరాశకు గురవుతున్న విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్ లతో సరిపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో విద్యార్ధులు కూడా ల్యాప్ టాప్ స్ధానంలో కనీసం ట్యాబ్ అయినా దొరుకుతుందని సంతోష పడాల్సిన పరిస్ధితి. అయితే వీరికి వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి కింద రూ.13 వేలు ఇస్తారా లేదా అన్నది తేలలేదు.