ప్రకాశం బ్యారేజీకి భారీ వరద-విజయవాడలో నీటమునిగిన ప్రాంతాలు-హెచ్చరికలు
కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వరదతో విజయవాడకు ముప్పు పొంచి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి నిన్నటి నుంచి భారీగా వరద తరలివస్తోంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు వస్తున్న నీటిని యథాతథంగా ప్రకాశం బ్యారేజీకి వదిలేస్తుండటంతో విజయవాడ వద్ద వరద పెరుగుతోంది. దీంతో అర్ధరాత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
అర్ధరాత్రి ప్రకాశం బ్యారేజీ సగం గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. అలాగే విజయవాడలోని కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయడం మొదలుపెట్టారు. అయితే వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు మునగడం ప్రారంభమైంది. దీంతో పాటే అధికారుల్లో కంగారు కూడా పెరుగుతోంది. మధ్యాహ్నం కల్లా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి నీటిని పూర్తిగా సముద్రంలోకి వదిలేయడం మొదలుపెట్టారు. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన నీరు తగ్గుతుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వస్తున్న దాదాపు 4.44 లక్షల క్యూసెక్కుల నీటిని యథాతథంగా సముద్రంలోకి వదిలేస్తున్నారు. అయినా పై నుంచి భారీ ఎత్తున వరద నీరు బ్యారేజీకి పోటెత్తుతోంది. దీంతో స్ధానికంగా పరిస్ధితుల్ని అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో నగర సీపీ కాంతిరాణా టాటా ఇవాళ పరిశీలించారు. స్ధానికుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి మరింత వరద ప్రవాహం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రకాశం బ్యారేజీకి భారీ వరద-విజయవాడలో నీటమునిగిన ప్రాంతాలు-హెచ్చరికలు#Andhrapradesh #Ntrdistrict #Vijayawada pic.twitter.com/SCXhExqz3K
— oneindiatelugu (@oneindiatelugu) August 12, 2022