ఫిరాయింపుల్లో కేసీఆర్ దే రికార్డు, కాంగ్రెస్ సవాల్ కు సమాధానమేది? : షబ్బీర్ అలీ
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్.. సుప్రీం ధర్మాసనం ద్వారా న్యాయ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ దే రికార్డు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గురువారం నాడు గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వేసిన పిటిషన్ పై స్పీకర్ కు, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు జారీ చేసిందన్నారు. ఫిరాయింపుదారులపై సుప్రీం అనర్హత వేటు వేయడం ఖాయమన్న షబ్బీర్ అలీ.. తద్వారా ఖాళీ అయ్యే 25 ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు త్వరలోనే ఉపఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు.
ఇప్పటికైనా పార్టీ మారిన నేతల చేత రాజీనామా చేయించి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని అదికార టీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు షబ్బీర్ అలీ. ఉపఎన్నికలకు కాంగ్రెస్ సిద్దంగా ఉందని షబ్బీర్ అలీ చెప్పుకొచ్చారు. ఇక ప్రాజెక్టుల రీడిజైనింగులపై కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాల్ కు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు సైతం దీనిపై ఎందుకు స్పందించట్లేదో తనకు అర్థం కావడం లేదన్నారు షబ్బీర్.