తెలంగాణలో షర్మిల ఓదార్పు, నేనూ మరణిస్తా: జగన్
మహబూబాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో ఓదార్పుయాత్ర కొనసాగుతుందని వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. తన చెల్లెలు షర్మిల తెలంగాణలో ప్రతి గడపకూ వచ్చి అందరినీ పలకరిస్తుందని, తన తండ్రి వైఎస్ మరణంతో గుండె పగిలి చనిపోయిన వారిని ఓదారుస్తుందన్నారు.
ఆయన ఆదివారం సాయంత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తాను సీమాంధ్రకు ముఖ్యమంత్రిగా ఎన్నికైనా తెలంగాణను వదిలే ప్రసక్తేలేదని అన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఇప్పటివరకు అనేక కష్టాలు పడుతున్నానని జగన్ వివరించారు. తన తండ్రి చనిపోయినపుడు తనకు ఏ రాజకీయమూ తెలియదన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చాలనే నిర్ణయంతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని వివరించారు. నేడు రాజకీయాలు చేస్తున్న ఏ నేతా పేదల గుడిసెలకు వెళ్లలేదని, వారి కష్టాలను దగ్గరినుండి చూడలేదని దుయ్యబట్టారు.
‘నేనూ ఏదో ఒక రోజు మరణిస్తాను, ఆ తరువాత పేదల గుండెల్లో నా తండ్రి తరహాలో నిలిచిపోవాలని మాత్రమే కోరుకుంటున్నాన'ని ప్రజల హర్షధ్వానాల నడుమ ఆయన అన్నారు. మానుకోట ఎంపి అభ్యర్థి తెల్లం వెంకట్రావ్, మానుకోట, డోర్నకల్ అసెంబ్లీ అభ్యర్ధులు సీతారాంనాయక్, సుజాత మంగిలాల్, తదితరులు సభలో పాల్గొన్నారు.