అందుకే, జగన్ పార్టీలో చేరుతున్నా: శిల్పా, బాబుపై తీవ్ర వ్యాఖ్యలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై శిల్పా మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాను ఎల్లుండి (బుధవారం) వైసిపి అధినేత జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతున్నట్లు తెలిప
నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై శిల్పా మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. తాను ఎల్లుండి (బుధవారం) వైసిపి అధినేత జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతున్నట్లు తెలిపారు.
శిల్పా చేరడం వెనుక, జగన్ చేర్చుకోవడం వెనుక...
కార్యకర్తల అభిప్రాయం మేరకే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పారు. నంద్యాల సీటుపై అధినేత చంద్రబాబు నాన్చుడు ధోరణితో తాను విసిగిపోయానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపిలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని వ్యాఖ్యానించారు.
భూమా చేరినా ఏమనలేదు.. కానీ
2014లో వైసిపి నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నా సర్దుకుపోయానని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవి ఇచ్చినా ఏమనలేదని అన్నారు. కానీ టిక్కెట్ ఇచ్చే విషయంలో నాన్చుడు ధోరణి వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
టిడిపిలో సముచిత స్థానం లేదు.. వెళ్లిపోదామా?
అంతకుముందు, శిల్పా మోహన్ రెడ్డి కార్యకర్తలతో భేటీ అయ్యారు. తన నివాసంలో మద్దతుదారులతో సమావేశమయ్యారు. తనకు టిడిపిలో సముచిత స్థానం లేదని, వైసిపి ఆహ్వానిస్తోందని వెళ్లిపోదామా అని అడిగారు. తనకు అధిష్టానంతో ఇటీవలి వరకు విభేదాలు లేవని, కానీ భూమా చేరిన తర్వాత అక్కడా ఇబ్బంది ఏర్పడిందని, అలాగే స్థానిక నేతలతో విభేదాలు ఉన్నాయని కార్యకర్తలతో చెప్పారు.
వైసిపి ఆహ్వానం.. నవ నిర్మాణ దీక్షకూ దూరం పెట్టారు
తనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిందని, నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇస్తామని చెబుతున్నారని, అందుకే వెళ్లడం ఉత్తమమని భావిస్తున్నానని కార్యకర్తలను అడిగారు. తనను జిల్లాలో నవ నిర్మాణ దీక్షకు కూడా దూరం పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
డేట్ ఫిక్స్..
కార్యకర్తలు అందరూ ఓకే అన్న అనంతరం శిల్పా డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ నెల 14న జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతానని అనుచరులకు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.