నిలదీసే నేతలే లేరా?: హోదాపై శివాజీ ఫైర్, ‘బీజేపీ, టీడీపీలే కారణం’
హైదరాబాద్/అమరావతి: సినీ హీరో శివాజీ మరోసారి కేంద్రంపై, ఏపీ రాజకీయ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కేంద్రాన్ని నిలదీసే నాయకులే లేరా? అంటూ నిలదీశారు.
తెలుగు ప్రజలను బీజేపీ మోసం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వాన్ని చూసి ఏపీ ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా విషయమై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్తాననడం చేతగాని తనమని, మనకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే నేతలే లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
హోదా వస్తేనే.. బయటకు రండి..
ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం బయటకు రావాలని డిమాండ్ చేశారు. అంతేగాక, ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, దానిని ఢిల్లీకి తీసుకెళ్లాలని శివాజీ డిమాండ్ చేశారు.
అలా చేస్తే బీజేపీదే అధికారం
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తే 2019లో బీజేపీదే అధికారమని శివాజీ అన్నారు. అంతకుముందు సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్పై బీజేపీ నేతలు కేంద్రానికి లేఖలు రాయాలని అన్నారు. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నేతల వితండవాదం
ఏపీకి చెందిన బీజేపీ నాయకులపై ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ మండిపడ్డారు. రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు విషయంలో ఏపీపై మోడీ సర్కారు విపక్ష చూపుతున్నప్పటికీ.. అంతా సవ్యంగా ఉందంటూ ఏపీ బీజేపీ నాయకులు వితండవాదన చేస్తున్నారంటూ మండిపడ్డారు.
సోము వీర్రాజు నోరు మెదపరా?
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వంటి నాయకులు పదే పదే చంద్రబాబు సర్కారును విమర్శించడం తప్ప.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోడీ ఎదుట నోరు మెదపడం లేదని విమర్శించారు. సోము వీర్రాజు తీరు చూస్తుంటే.. ఏపీ బీజేపీ శాఖకు అధ్యక్షుడయ్యేందుకు.. తమ అధిష్టానాన్ని ప్రసన్నం కోసం మీడియా ముందు అవాకులు చెవాకులు పేలుతున్నట్లుందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడంపై ఆయన చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.
ఎన్ని గిమ్మిక్కులు చేసినా..
బీజేపీ నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ వంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని.. విభజన చట్టం హామీలను నెరవేర్చేందుకు ప్రధాని మోడీపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయానికి బీజేపీ, టీడీపీ రెండూ కారణమేనని.. విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. ఏపీలో బీజేపీ బలపడదని శివాజీ తేల్చి చెప్పారు.