జగన్కు షాక్: సమావేశానికి 30 ఎమ్మెల్యేలు డుమ్మా?
హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్ష సమావేశానికి దాదాపు 30 మంది శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు పార్టీ శాసనసభా పక్షం హైదరాబాదులోని లోటస్పాండ్లో గల పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైంది. కీలకమైన ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ శాసనసభ్యులందరికీ వర్తమానం వెళ్లింది. అయినా 30 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగానే మారింది.
శాసనసభ్యులు గైర్హాజరు కావడానికి కచ్చితమైన కారణాలు ఏమీ తెలియడం లేదు. కానీ ఇది ఓ రకంగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చే విషయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పార్టీకి శాసనసభ్యులు దూరమవుతున్నారనే ప్రచారం నేపథ్యంలో ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
అంశాలవారీగా ముందుకు వెళ్లాలని, తాము మాట్లాడే అంశాలపై ముందుగా తగిన కసరత్తు చేయాలని వైయస్ జగన్ శాసనసభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. సమావేశాలకు విధిగా హాజరు కావాలని ఆయన శాసనసభ్యులను ఆదేశించారు. పార్టీ సీనియర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, రాష్ట్ర శాసనసభలో చర్చకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొత్తం 16 అంశాలను ప్రతిపాదించింది. విభజన చట్టం, విభజన హామీలు, సమస్యలపై చర్చించాలని పార్టీ సూచించింది. శనివారంనాడు గవర్నర్ ప్రసంగం అనంతరం జరిగిన బిఎసి సమావేశంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆ ప్రతిపాదనలు చేసింది.
రైతు ఆత్మహత్యలు, కరువు ప్రాంతాలపై, తాగు నీటి సమస్య, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అంశాలపై చర్చ చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డిమాండ్ చేసింది. రైతు, డ్రాక్రా మహిళలు, చేనేత రుణమాఫీలపై చర్చించాలని సూచించింది. పట్టిసీమ ఎత్తిపోతలు, పోలవరం ప్రాజెక్టు అంశాలు కూడా కీలకమైనవంటూ వైయస్సార్ కాంగ్రెసు చర్చకు ప్రతిపాదించింది. ఇంకా పలు అంశాలపై వైయస్సార్ కాంగ్రెసు ప్రతిపాదన చేసింది.












Click it and Unblock the Notifications