బాబూ! అన్నీ ఆగిపోవాలా: శిల్పా కోడలు సవాల్, ఒత్తిడి చేస్తున్నారని సంచలనం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగిని రెడ్డి సవాల్ విసిరారు.
నంద్యాల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగిని రెడ్డి సవాల్ విసిరారు.
చదవండి: శిల్పాను ఏం చేయలేరు, భయపడకండి, బాబు బాధపెట్టారు: శిల్పా కౌంటర్
శిల్పా సహకార బ్యాంక్పై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను శిల్పా మోహన్ రెడ్డి కోడలు శిల్పా నాగిని రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడుతున్నారన్నారు.
రుణాలు ఇచ్చాం, గట్టిగా అడగట్లేదు
శిల్పా సహకార బ్యాంకు ద్వారా వేల మంది మహిళలకు రుణాలు ఇచ్చామని శిల్పా నాగిని రెడ్డి చెప్పారు. వడ్డీ లేని రుణాలు నుంచి అర్థ రూపాయి వడ్డీ వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఏ మహిళను రుణం కట్టమని గట్టిగా అడిగింది లేదన్నారు.
Recommended Video
చంద్రబాబూ! ఇవన్నీ ఆగిపోవాలా
బ్యాంకు నష్టాలలో నడుస్తున్నా సంకల్ప బలంతో ముందుకు తీసుకు వెళ్తున్నామని నాగినిరెడ్డి చెప్పారు. బ్యాంకు ద్వారా మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడేలా చేస్తున్నామన్నారు. ఇవన్నీ ఆగిపోవాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశమన్నారు.
సిసి ఫుటేజీ ఇస్తాం
చంద్రబాబు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని నాగినిరెడ్డి విమర్శించారు. గడిచిన ఆరు నెలల సీసీ ఫుటేజ్ను ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ ఫుటేజ్ను పరిశీలించి కావాలంటే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
బ్యాంకును మూసేయాలని ఒత్తిడి
బ్యాంకును మూసేయాంటూ 2 నెలలుగా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని, విచారణ పేరుతో తనను ఇబ్బందిపెడుతున్నారని శిల్పా నాగిని రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఏడేళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా బ్యాంకును నడుపుతున్నామని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమ కుటుంబంపై బురద జల్లుతున్నారన్నారు.