బుద్ధి, జ్ఞానం లేదా?: ఊగిపోయిన టీడీపీ ఎమ్మెల్యే, వాళ్లను చెప్పుతో కొడుతామని!
అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు రైతులు, డ్వాక్రా మహిళలను దూషించినట్లుగా సమాచారం.
అనంతపురం: రైతులు, డ్వాక్రా మహిళల పట్ల అనంతపురం ఎమ్మెల్యే యామిని బాల దురుసుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సమస్యలపై ప్రశ్నించినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే నోరు పారేసుకోగా.. అక్కడే ఉన్న కార్యకర్తలు రైతులు, డ్వాక్రా మహిళలను దూషించినట్లుగా తెలుస్తోంది.
ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఈ వివాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఎమ్మెల్యే యామిని బాల గార్లదిన్నె మండలం ఇల్లూరులో పర్యటిస్తుండగా రైతులు, డ్వాక్రా మహిళలు ఆమెను నిలదీశారు. తుంగభద్ర నుంచి నీరు వచ్చేలా చేయాలని వారు కోరడంతో.. ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. మీకు బుద్ది, జ్ఞానం లేదంటూ నోటికి పనిచెప్పారు.
ఇంతలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు సైతం నోరు పారేసుకున్నారు. ప్రశ్నిస్తే చెప్పుతో కొడుతామంటూ టీడీపీ నేత రామాంజనేయ బహిరంగంగానే హెచ్చరించారని తెలుస్తోంది.
కాగా, టీడీపీ నేతల వైఖరిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళల మీద ఆమె నోరు పారేసుకోవడం సరికాదంటున్నారు. తమ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.