ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి : రసాయన పరిశ్రమలో మంటలతో..!!
ఏలూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మసునూరు మండలంలోని రసాయన పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని అక్కిరెడ్డి గూడెం పోరస్ పరిశ్రమలో రాత్రి ఈ ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ప్రమాదశాత్తు పెద్ద ఎత్తున ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరొకరు చికిత్సకు తరలిస్తుండగా మరణించినట్లు చెబుతున్నారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
Recommended Video
క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. పోరస్ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం. ఏలూరు ఎస్పీ.. ప్రమాద స్థలిని పరిశీలించారు.
అయితే, స్థానికులు మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వచ్చాయని..గేట్లు తీయకపోయేసరికి బలవంతంగా లోపలికి వెళ్లామని చెప్పుకొచ్చారు. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని వివరించారు. చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారని చెబుతున్నారు.
ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదని వాపోతున్నారు. ప్రమదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ..ప్రమాదానికి గల కారణాలపైన వివరాలు సేకరించారు.