చంద్రబాబుకు తప్పిన ప్రమాదం: బస్సులో పొగలు, విశాఖలో కారు బీభత్సం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న బస్సులో పొగలు వచ్చాయి. దీంతో ఆయన మరో కారులో వెళ్లారు. చంద్రబాబు బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి బయలుదేరారు. ఆయన ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు.
ప్రపంచ వికలాంగుల దినోత్స కార్యక్రమానికి ఆయన రాజమండ్రిలో హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట నుండి మధురపూడి విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుండి రాజమండ్రికి బస్సు ద్వారా వెళ్లారు. అయితే, అక్కడి నుండి కొద్ది దూరం వెళ్లాక ఆయన ప్రయాణించే బస్సులో పొగలు వచ్చాయి.
వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. చంద్రబాబు మరో కారులో రాజమండ్రికి వెళ్లారు. ఈ పొగలు చంద్రబాబు పాల్గొనే కార్యక్రమానికి మూడు కిలోమీటర్ల దూరంలో వచ్చాయి.
విశాఖలో కారు బీభత్సం, ఇద్దరు మృతి
విశాఖపట్నం జిల్లాలోని రావికమతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం అతివేగంతో వస్తున్న ఓ కారు ముందగా సైక్లిస్ట్, బైక్మీదకు, ఆ తరువాత ఆటో మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందగా, బైక్పై ఉన్న వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఆటోలో ఉన్న పదిమంది వ్యక్తులు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు యజమాని మాజీ వైస్ ఎంపీపీ గంటా ఈశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. బ్రేకులు ఫెయిలై కారు పాదాచారుల పైకి దూసుకెళ్లింది.