ఆ వ్యక్తిని అలా చూసి డాక్టర్లు షాక్: ఏకంగా పాముతోనే!..
పామును పట్టుకోవడానికి వెళ్లిన రమణ.. ఆ క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. పాము కాటువేసినా సరే అధైర్యపడకుండా.. దాని తలను ఎడమచేతితో బలంగా అదిమిపట్టాడు. దీంతో అది చేతికి చుట్టుకుపోయింది.
చిత్తూరు: పాము కాటుకు గురైన ఓ వ్యక్తి.. చికిత్స కోసం ఏకంగా పాముతోనే ఆసుపత్రిలో దర్శనమియ్యడంతో వైద్యులు షాక్ తిన్నారు. ఓ చేయిపై పాము కాటు వేయగా.. మరో చేయిపై అదే పాము లుంగలు చుట్టుకుపోయింది. దీంతో భయపడుకుంటూనే వైద్యులు అతనికి చికిత్స చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని తెల్లనీళ్లపల్లెకు చెందిన రమణ(50) వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. దానిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిగాక అప్పుడప్పుడు పాములను పడుతుంటాడు. ఎవరైనా తమ ఇళ్లలోకి పాము చొరబడిందని చెబితే.. వాటిని పట్టుకుని జనావాసాలకు దూరంగా వదిలేస్తాడు.

ఇదే నేపథ్యంలో ఆదివారం రాత్రి 11.45గం.కు చిట్రెడ్డిపల్లెకు చెందిన రామకృష్ణ ఇంట్లో పాము చొరబడటంతో రమణకు కబురు పెట్టారు. దీంతో పామును పట్టుకోవడానికి వెళ్లిన రమణ.. ఆ క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. పాము కాటువేసినా సరే అధైర్యపడకుండా.. దాని తలను ఎడమచేతితో బలంగా అదిమిపట్టాడు. దీంతో అది చేతికి చుట్టుకుపోయింది.
అనంతరం రామకృష్ణ సహాయంతో ద్విచక్రవాహనంపై చౌడేపల్లెలోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత పాముతో రమణ ఆసుపత్రికి వచ్చేసరికి నర్సులు కంగారుపడ్డారు. భయం భయంగానే అతనికి పాము విరుగుడు ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత రమణ పామును చంపేశాడు.
అక్కడినుంచి పాము చికిత్సకు పేరుగాంచిన శివాడికి ప్రైవేటు వాహనంలో రమణను రామకృష్ణ తరలించాడు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 2గం. సమయంలో నాటు వైద్యం చేయించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకు అతను 15సార్లు పాము కాటుకు గురయ్యానని వెల్లడించడం గమనార్హం.












Click it and Unblock the Notifications