వన్డే మ్యాచ్లా, ఛార్జింగ్ డౌన్!-ఫుల్ఛార్జీలో, మీరేం చేస్తున్నారు?: గల్లా, పవన్ మధ్య ట్వీట్ వార్
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ల సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. మొదట గల్లా జయదేవ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సెటైర్లు వేయగా.. జనసేన అందుకు కౌంటర్లు ఇచ్చింది. ఆ కౌంటర్లకు మళ్లీ జయదేవ్ బదులిచ్చారు.
మొదట గల్లా జయదేవ్ తన ట్విట్టర్ ఖాతాలో ' కొత్త సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. జగన్-పవన్ టైటిల్తో రాబోతున్న ఈ చిత్రానికి కథ-దర్శకత్వం ప్రశాంత్ కిషోర్ అయితే మోడీ-షా ప్రొడక్షన్స్ బ్యానర్లో ఈ చిత్రం విడుదల అవుతుంది..' అంటూ సెటైరికల్గా కొన్ని పంచ్లు పేల్చిన విషయం తెలిసిందే.
మౌనం వెనుక కారణం ఏంటో..
గల్లా చేసిన ఈ వ్యాఖ్యలకు రెండు రోజుల తర్వాత జనసేన పార్టీ నుంచి ఓ ప్రెస్ నోట్ని జనసేన పార్టీ విడుదల చేసింది. ‘వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్లా ఒక్కసారి లోక్ సభలో స్పెషల్ స్టేటస్పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు.. మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలకు తెలుసు సార్.. కొత్త సినిమా. కథ-డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి.. స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాస్టారు..' అంటూ జనసేన కౌంటర్ అటాక్ చేసింది.
సెంచరీ చేశాం..
దీనికి గల్లా జయదేవ్ కూడా కౌంటర్ ఇచ్చారు. ‘4 సంవత్సరాల నుంచి సుమారు 100 సార్లు స్పీచ్ ఇచ్చాను. అంటే సెంచరీ కొట్టాను. ప్రత్యేక హోదా కోసం మేము కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రిపై యుద్ధం చేస్తూనే ఉన్నాం' అని గల్లా వ్యాఖ్యానించారు.
పవన్.. మీరేం చేస్తున్నారు?
అంతేగాక, ‘మరి పవన్ కల్యాణ్ గారు ప్రధానమంత్రిపై ఎందుకు ఆధారపడుతున్నారో? అసలు ఆయన ఎవరితో ఫైట్ చేస్తున్నాడు? ఇక మా బ్యాటరీస్ గురించి చెప్పాలంటే.. అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్తోనే ఉంటాయి. అవి ఎప్పటికీ అలాగే ఉంటాయి. నిజంగా అలాగే ఉంటాయి'' అంటూ గల్లా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం అవుతుంది. దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూద్దాం.
పవన్ విగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన అభిమానులు ఎంతటి అభిమానం కనపరుస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఓ అభిమాని అయితే, ఏకంగా పవన్ కల్యాణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఏడున్నర అడుగుల పవన్ నిలువెత్తు విగ్రహం నెలకొల్పాడు. తెలుపు రంగు ప్యాంటు, ఖాకీ రంగు లాల్చీతో ఉన్న ఈ విగ్రహం మెడలో జనసేన పార్టీ కండువా, నడుముకు ‘గబ్బర్ సింగ్' టవల్ చుట్టి ఉన్నాయి. విగ్రహావిష్కరణ కార్యక్రమం ఇంకా జరగలేదు. ఈ విగ్రహాం ఫొటో ఇప్పటికే సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్గా మారింది.