యువతి మోసం చేసిందని విజయవాడలో సాప్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
విజయవాడ: నగరంలోని చిట్టినగర్లో దారుణం జరిగింది. పోలీసులు మందలించారనే కారణంతో ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే తాజుద్దీన్ అనే సాప్ట్వేర్ ఇంజనీర్ తాను ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఒకే కంపెనీలో పనిచేస్తున్న యవతితో తాజుద్దీన్ గత కొంతకాలంగా సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అంతేకాదు ఇద్దరూ కూడా కలిసి స్నేహితులు, బంధువులు పెళ్లిళ్లకు వెళ్లారు. ఈ క్రమంలో తాజుద్దీన్ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమెనంటూ పలువురికి పరిచయం చేశాడు.
అయితే ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు కావడంతో అమ్మాయిని ఇంట్లో వాళ్లు మందలించారు. ఈ క్రమంలో తన వెంట పడుతున్నాడని ఆ యవతి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు స్టేషన్కు పిలిపించి యువతి వెంట పడొద్దని మందలించి అనంతరం వదిలేశారు.
దీంతో తనను పోలీస్ స్టేషన్ను తీసుకెళ్లారన్న మనస్తాపానికి గురై అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు కాణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
యువతిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. చివరకు పోలీసులు కలగజేసుకుని ఇక్కడ నుంచి తాజుద్దీన్ మృతదేహాన్ని తీసుకెళ్లాలని నచ్చజెప్పి పంపించారు.