సోమయాజులు ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా : సీఎం జగన్
విజయవాడ:2014లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు తాను చేసిన ప్రతి ప్రసంగం వెనక డీఏ సోమయాజులు ఉన్నారని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం జగన్. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి డీఏ సోమయాజులు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. డీఏ సోమయాజులు 67వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ముందుగా సోమయాజులుకు ఘననివాళులు అర్పించిన సీఎం జగన్ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుుకున్నారు. సోమయాజులు తనకు గురువులాంటి వారని జగన్ అన్నారు.

సోమయాజులు ఒక లివింగ్ ఎన్సైక్లోపీడియా అని సీఎం జగన్ కొనియాడారు. ఎలాంటి సమాచారం అయినా సరే ఏ విషయమైనా సరే సంపూర్ణ అవగాహన ఉండేదని అన్నారు. అన్ని విషయాలపై తమ శాసనసభ్యులకు క్లాసులు చెప్పేవారని జగన్ తెలిపారు. కాంగ్రెస్ను వీడి వైసీపీని ఏర్పాటు చేసినప్పుడు తొలిగా తనతో వచ్చింది సోమయాజులు అని చెప్పేందుకు తాను చాలా గర్వపడుతున్నట్లు సీఎం జగన్ చెప్పారు. ఇక సోమయాజులు రూపంలో ఆయన కుమారుడు కృష్ణ తన కళ్ల ముందు ఎప్పుడూ ఉంటారని జగన్ అన్నారు. సోమయాజులులానే కృష్ణకు కూడా మంచి విషయ పరిజ్ఞానం ఉందని జగన్ కొనియాడారు. తండ్రికి మించిన తనయుడుగా కృష్ణ గుర్తింపు తెచ్చుకుంటారని జగన్ అన్నారు.
సోమయాజులు కుటుంబానికి అంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు జగన్. సోమయాజుల కుటుంబానికి దేవుడు అన్ని విధాలా మేలు చేస్తారని తాను విశ్వసిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఇదిలా ఉంటే నాడు జగన్ తండ్రి వైయస్కు అత్యంత ఆప్తుడిగా సోమయాజులు ఉండగా... ఇప్పుడు సీఎం జగన్కు ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ ఉన్నారు.గతేడాది మే నెలలో అనారోగ్యంతో సోమయాజులు కన్నుమూశారు. ఈ ఆత్మీయ కార్యక్రమంలో సోమయాజులు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు, రాష్ట్రమంత్రులు,వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొని నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications