పిచ్చిరాతలా, బాధగా ఉంది: మీడియాపై కేసీఆర్ ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మీడియా పైన ఆగ్రహాన్ని, అసహనాన్ని వ్యక్తం చేశారు. హౌస్ హోల్డ్ సమగ్ర సర్వే పైన కేసీఆర్ సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు హితవు పలికారు. ప్రభుత్వం ఒకటి చెబితే.. మీడియా మరొకటి రాస్తోందన్నారు. ఇప్పటికీ మీడియా అలాంటి వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. దీనిని అధిగమించేలా చర్యలు చేపడతామన్నారు.
కొంతమంది కావాలనే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలా రాస్తున్నారన్నారు. విచ్చలవిడిగా రాసే మీడియా ఉందన్నారు. అది ప్రజాస్వామ్యంలో మంచిది పద్ధతి కాదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పిచ్చి వార్తలు వద్దని, ఏదైనా ఉంటే అడిగి రాయాలన్నారు. అడిగి రాయమని చెప్పినా మానటం లేదని, ఇది మీడియాకే మంచిది కాదన్నారు. తాను డిక్టెట్ చేసి చెప్పడం లేదని, బాధతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు.
ఈ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్ల పత్రికలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నుండి అనధికారికంగా బాధ్యతలను తీసుకున్నట్లుగా వచ్చిందని, ఈటెల తమ ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తి అని, ఆయనను పట్టుకొని దిక్కుమాలిన వార్తలు రాస్తారా అన్నారు. దీనిపై సదరు మీడియా సంస్థ వివరణ ఇవ్వాలన్నారు. డెయిలీ ఇలాంటి వార్తలను చూసి తాను నవ్వుకుంటున్నానని, అలాగే బాధపడుతున్నానని చెప్పారు. ఈ పిచ్చి రాతలు మానుకోవాలని, ఈ జర్నలిజం ఎవరికీ మంచిది కాదని, ఓవర్ సెన్షేషనల్ వద్దన్నారు.
దళితుల భూమిపై ఇలా...
దళితులకు ఇచ్చే భూమి పైన కూడా కేసీఆర్ మాట్లాడారు. అసలే భూమిలేని దళితులకు తాము మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు. అలాగే ఎవరికైనా ఒక ఎకరం, రెండు ఎకరాలు ఉంటే.. మిగతాది కొనిచ్చి మూడు ఎకరాలు చేస్తామన్నారు. దళితులకు బడ్జెట్లో 15.4 శాతం కేటాయిస్తామన్నారు. కమతాలను ఏకీకరణ చేస్తామన్నారు. ఏమాత్రం భూమిలేని దళితులకు ప్రభుత్వం భూమి కొనిస్తుందన్నారు.
అలాగే వారికి ఇరిగేషన్, కరెంట్ మోటార్లు వంటి వాటిని కూడా ఇస్తామన్నారు. అలాగే, సంవత్సరానికి అయ్యే పెట్టుబడిని కూడా ఇస్తామన్నారు. ఏ విషయంలోను మనకు తొందరపాటు వద్దన్నారు. అనగానే ఏదీ పూర్తి కాదన్నారు. కొంత సమయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో దాదాపు ప్రతి దళితులకు భూమి ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.