కన్నాను సాగనంపాల్సిందే - హైకమాండ్ వద్ద సోము పట్టు..!?
ఏపీ బీజేపీలో వర్గ పోరు తారా స్థాయికి చేరింది. పార్టీ నాయకత్వంలో ఐక్యత లోపించింది. ఇప్పుడు ఏపీ బీజేపీలో కన్నా వర్సస్ సోము వార్ నడుస్తోంది. పవన్ కల్యాణ్ బీజేపీ తీరు పైన అసహనం వ్యక్తం చేసిన వెంటనే కన్నా స్పందించారు. పవన్ బీజేపీతో దూరం అయ్యే పరిస్థితికి సోము విధానాలే కారణమని మండిపడ్డారు. ఆ వెంటనే సోము పార్టీ అధినాయకత్వానికి కన్నాపైన ఫిర్యాదు చేసారు. హూకమాండ్ సూచనల తో కన్న కొద్ది రోజులు మౌనం పాటించారు. ఇప్పుడు కొంత మంది జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తప్పించటంతో కన్నా మరోసార ఫైర్ అయ్యారు. దీంతో, కన్నా పైన చర్యలు తీసుకోవాలంటూ సోము వీర్రాజు పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
కన్నా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తప్పించారు. దీని పైన కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే వారందరినీ తాను నియమించాననే కారణంతో తీసేస్తున్నారని ఫైర్అయ్యారు. సోము టార్గెట్ గా కన్నా విమర్శలు కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ నేతలు జోక్యం చేసుకోవటం లేదు. తాజాగా కన్నా చేసిన వ్యాఖ్యలను ఆధారాలతో సహా పార్టీ అధినాయకత్వానికి సోము వివరించినట్లు తెలుస్తోంది. కన్నా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపైన ఆరోపణలు చేస్తున్నా..పార్టీ స్పందించకపోవటం పైన సోము వర్గం గుర్రుగా ఉంది. పార్టీని వీడాలని నిర్ణయించే కన్నా ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని సోము వర్గం ఆరోపిస్తోంది. తనంతటగా తాను పార్టీని వీడకుండా.. పార్టీయే బయటకు పంపేలా చేసుకోవటమే కన్నా వ్యూహంగా సోము వర్గం చెబుతోంది.
కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోనే కొనసాగుతానని..తాను జనసేనలో చేరుతాననే ప్రచారం సరి కాదని తాజాగా చెప్పుకొచ్చారు. మిత్రపక్షం నేతలుగా జనసేన నాయకులు తనతో కలుస్తూ ఉంటారని వివరించారు. మిత్రపక్షాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైన ఉందని కన్నా పేర్కొన్నారు. అయితే, కన్నా ఇప్పటికే టీడీపీ..జనసేనతో టచ్ లో ఉన్నారని సోము వర్గం పార్టీ నాయకత్వానికి నివేదించింది. ఈ నెల 16,17 తేదీల్లో ఢిల్లీ కేంద్రంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు కన్నాకు ఆహ్వానం అందకపోవచ్చని సోము వర్గం అంచనా వేస్తోంది. దీంతో, ఇప్పుడు బీజేపీ హైకమాండ్ ఏపీ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఏ విధంగా స్పందిస్తుందీ.. ఏం చేయబోతోందనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి కరంగా మారుతోంది.