జయదేవ్! మోడీకి క్షమాపణ చెప్పు, కెసిఆర్ని చూడు: బాబుని ఏకేసిన సోము వీర్రాజు
గుంటూరు: ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదని, ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రధాని మోడీకి క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదివారం మండిపడ్డారు.
ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన కూడా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న నిరంతర విద్యుత్, రుణమాఫీ కేంద్రం సహకారంతో చేసినవేనని చెప్పారు. రాష్ట్రం నిర్వహించే కార్యక్రమాలలో బిజెపి నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వనని ఎప్పుడూ చెప్పలేదన్నారు. అడ్డంకులు తొలగించే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. మోడీ ప్రసంగంపై గల్లా జయదేవ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ప్రజల సంక్షేమం కోసం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను చంద్రబాబు సర్కారు తమవిగా ప్రచారం చేసుకుంటోందని వీర్రాజు విరుచుకుపడ్డారు. సంక్షేమ పథకాలపై కేవలం చంద్రబాబు చిత్రాన్ని మాత్రమే ప్రచురిస్తూ ఉండటం వెనుక మర్మమేమిటన్నారు.
పక్కనే ఉన్న తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో పాటు ప్రధాని మోడీ చిత్రాలను సైతం ప్రచురిస్తున్నారన్నారు. ఏపీలో అలా జరగడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
విభజనకు కాంగ్రెస్, వైసిపిలే కారణమని టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు వేరుగా అన్నారు. ఏపీకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. బిజెపి అభివృద్ధిని జగన్, రఘువీరా ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని బిజెపి నేత కోటేశ్వర రావు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మండిపడ్డారు.