ఆ వ్యవస్థ కోసం రూ. 310 కోట్లు వృథా.. సోము వీర్రాజు, తిరుపతిలో గెలుపునకు మూడంచెల ప్లాన్
తిరుపతి: ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో నవరత్నాల అమలు కోసం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు ఓటర్లను బెదిరింపులకు గురిచేశారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ. 310 కోట్ల ప్రజాధనం వృథా చేస్తోందని ఆక్షేపించారు.
తిరుపతి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థ.. ఎన్నికల నిర్వహణకు ప్రతిబంధకంగా మారుతోందని అన్నారు. పోలీస్, పంచాయతీరాజ్, వాలంటీర్ వ్యవస్థల అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సోము వీర్రాజు తెలిపారు.

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రచారం, పర్యవేక్షణ కోసం రెండంచెల కమిటీని ఏర్పాటు చేసినట్లు సోము వీర్రాజు తెలిపారు. ప్రచార, నియోజకవర్గాల బాధ్యుల కమిటీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నేతృత్వం వహిస్తారని చెప్పారు.
కాగా, ఏప్రిల్ 17న తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక జరుగనుండగా.. తిరుపతి టీడీపీ లోక్సభ అభ్యర్థిగా పనబాక లక్ష్మిని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీ కూడా తమ అభ్యర్థిగా గురుమూర్తిని ప్రకటించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థికే జనసేన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రచారం చేయనున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం ప్రారంభించారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు. గెలుపు కృషి చేయాలని నేతలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications