తెలుగు భాషకు పట్టం కట్టిన ఎస్పీ బాలు ... స్వరాభిషేకం చేసి మరీ వర్ధమాన గాయకులకు మార్గదర్శిగా..
గాన గంధర్వుడు , సంగీత ప్రపంచంలో రారాజు , బాల చంద్రుడుగా తెలుగు సినీవినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన ధృవ తార ఎస్పీ బాలు మృతి ఎవరూ జీర్ణించుకోలేకపొతున్నారు . తన గానంతో తెలుగు కళామతల్లికి సుగంధాలను అద్దిన , సుమ మాల వేసిన సుస్వరాల రారాజు ఎస్పీ బాలసుబ్రమణ్యం. తెలుగు భాషామతల్లికి పట్టం కట్టిన సుప్రసిద్ధ గాయకుడు. తెలుగు భాషలో నేటి గాయకులు పాడుతున్న అనేక పాటలలో తప్పులను దిద్దుతూ, స్పష్టమైన ఉచ్చారణను ,పదాల భావాలను, పాటలు రాసిన సందర్భాలను అర్థవంతంగా చెబుతూ వారికి దారి చూపిన మార్గదర్శి. ఆయన సంగీత ప్రపంచానికి దిక్సూచి .

తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసిన భాషామతల్లి ముద్దు బిడ్డ
తెలుగు భాషామతల్లికి ఎనలేని సేవ చేశారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. 74 సంవత్సరాల వయసులో కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో తన గాన మాధుర్యాన్ని వినిపిస్తూనే ఉన్నారు. భాష యొక్క గొప్పతనాన్ని, తెలుగు సినిమా చరిత్రలో గత జ్ఞాపకాలను, ప్రస్తుత తరాలకు అందిస్తూ, తెలుగు సినీ చరిత్రలో పని చేసిన ఎందరో మహానుభావుల గురించి బాలసుబ్రమణ్యం చెప్పినంతగా ఇంకెవరు చెప్పలేరేమో. సంవత్సరాలు,తేదీలతో సహా గుర్తుపెట్టుకుని మరి కొన్ని సందర్భాలను గుర్తు చేసి మహనీయుల గొప్పతనాన్ని అందరికీ తెలియ చేసిన మేధా సంపత్తి ఒక్క బాలసుబ్రహ్మణ్యం కే సొంతం.

తెలుగు భాష, పాటలపై ఆయన మేధో సంపత్తి అనన్య సామాన్యం
అంతటి ఘనత, తెలుగు పాటలకు పట్టం కట్టిన నిపుణత ఉన్న బాలసుబ్రమణ్యం టెలివిజన్ రంగంలోనూ అనేక కార్యక్రమాలను నిర్వహించి వర్ధమాన గాయకులకు భవిష్యత్ బాటలు వేశారు. వారిలోని నైపుణ్యాలను వెలికి తీశారు. వారిలోని తప్పొప్పులను దిద్ది మెరికల్లాంటి ఈతరం గాయకులను తయారు చేశారు. గాయకులుగా రాణించాలని తపన, ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఒక మార్గదర్శిగా నిలిచారు. టెలివిజన్ రంగంలో చాలా కాలం నుండి పలు సంగీత కార్యక్రమాల ద్వారా తెలుగు పాటల గొప్పదనాన్ని, పాటలోని మాటలు తియ్యదనాన్ని, రచయితల శ్రమను అర్థమయ్యేలా చెప్పారు ఎస్పీ బాలసుబ్రమణ్యం .

బాలు ముందు పాట పాడాలంటే స్పష్టంగా పలకవలసిందే .. అర్ధం తెలుసుకు తీరాల్సిందే !!
చాలామంది ప్రస్తుతం తెలుగు భాషను సరిగ్గా మాట్లాడటం రాక, అనేక శబ్దాలను తప్పుగా ఉచ్ఛరిస్తున్నారు. కొన్ని పదాలకు అర్ధం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో కూడా ఆయన తెలుగు పాటల్లో తెలియకుండా పలువురు చేస్తున్న తప్పులను కరెక్ట్ చేస్తూ భాషను కాపాడుతున్నారు. తెలుగు భాషపై పట్టున్న వారిలో సంగీత ప్రపంచంలో బాలసుబ్రమణ్యం ని మించిన వారు ఎవరూ లేరు. నిక్కచ్చిగా ఎవరైనా పదాలను తప్పుగా ఉచ్చరిస్తే ఆయన వారికి క్లాస్ తీసుకునేవారు. అందుకే బాల సుబ్రహ్మణ్యం ముందు ఎవరైనా పాట పాడాలి అంటే ఆ పాట యొక్క అర్ధాన్ని, భావాన్ని తెలుసుకొని, ఆ పదాలను స్పష్టంగా ఉచ్చరిస్తూ పాడి తీరవలసిందే.
Recommended Video

తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో తెలుగు తల్లికి నిత్యం స్వర నీరాజనం
అంతటి పర్ఫెక్షనిస్ట్ కావడంవల్ల ప్రస్తుతం ఆయన మరణంతో తెలుగు భాషామతల్లి కన్నీరు పెడుతుంది అంటున్నారు పలువురు రచయితలు. కళామతల్లికి కాకుండా, తెలుగు భాషామతల్లి కూడా స్వరాభిషేకం చేసిన ఘనుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇటువంటి మహనీయుని మరణంతో తెలుగు తోట చిన్నబోయింది అంటున్నారు . బాలు వంటి గాయకుడు నభూతోనభవిష్యతి అంటున్నారు. ఆయన మరణం తెలుగు భాషామతల్లి బిడ్డను కోల్పోవడమే అని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్కనైన భాష, సమయోచిత పదప్రయోగం, సందర్భోచిత వివరణలతో బాలసుబ్రమణ్యం తెలుగు వారి గుండెలను దోచుకున్నారు. ఆయన పాటలే కాదు సరదాగా ఉండే ఆయన మాటలు, ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆయన వదనం మర్చిపోలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications