ప్రభుత్వం పడిపోతుందనే: హోదాపై బాబు ట్విస్ట్, ఇంకా ఆశలు, తెలంగాణపై..
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందనే నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు చెప్పారు. ఆయన ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పలువురు కేంద్రమంత్రులకు కృష్ణా పుష్కరాలకు ఆహ్వానం పలికారు.
అనంతరం ఆయన సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. తాను విభజన హామీలపై ప్రధాని మోడీతో చర్చించానని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటామని ప్రధాని చెప్పారన్నారు. ఈ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా పైన ప్రకటన చేయాలని తాను విజ్ఞప్తి చేశానని చెప్పారు.
సభా హక్కుల ఉల్లంఘన: అరుణ్ జైట్లీకి కేవీపీ షాక్, హోదాపై ట్విస్ట్
జిఎస్టీతో లింక్ పెట్టలేదేం
ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. వారికి రాజకీయం ముఖ్యమన్నారు. అయినా కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన బిల్లుకు పదకొండు పార్టీలు మద్దతు పలికాయని, అది సంతోషకరమన్నారు. విభజన సమయంలో చాలా అంశాలు పొందుపర్చారన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి ఉంటే.. హోదాకు, జీఎస్టీ బిల్లుకు ఎందుకు లింక్ పెట్టలేదని ప్రశ్నించారు. అవకాశం వచ్చినప్పుడే సాధించుకోవాలన్నారు. కష్టాలలో ఉన్న ఏపీకి కేంద్రం సహకరించాలన్నారు. ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదన్నారు.
మరో రెండేళ్లయినా తాము తెలంగాణతో సమానంగా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీకి అయిదేళ్ల ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు.. ఇలా పలు హామీలను నాటి కేంద్రం నాడు హామీ ఇచ్చిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే తాను డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.
ఏపీలో ఆర్థిక లోటు ఉందని 14వ ఆర్థిక సంఘం చివరినాటికి చెప్పిందన్నారు. రాజకీయాల్లో అవకాశం వచ్చినప్పుడు గట్టిగా అడిగి సాధించాలన్నారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరానని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం తాము సభలో పోరాడామన్నారు. హోదా పైన ఏదో ఒకటి చెప్పాలని తమ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఏపీకి హోదా వస్తే రాష్ట్రానికి రావాల్సిన వనరులు వస్తాయని చెప్పారు. 2018-19కి పోలవరం పూర్తి కావాలన్నారు.
ప్రత్యేక హోదా చట్టంలో లేదు కానీ
చట్టంలో ప్రత్యేక హోదా లేదు కానీ ఆ అంశం పైనే బిల్లు పార్లమెంటులో నాడు ఆమోదం పొందిందని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, కాబట్టి కేంద్రమే దానిని నిర్మించాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా పరిశ్రమలు లేవన్నారు. పరిశ్రమలు ఎక్కువగా లేకుంటే సేవా పరిశ్రమలు రావన్నారు.
కేవీపీ బిల్లు ఓడితే ప్రభుత్వం పడిపోతుంది
కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు ద్రవ్య బిల్లా, కాదా అని తేల్చేందుకు లోకసభకు పంపించారన్నారు. ద్రవ్య బిల్లు ఓడిపోతే తాము రాజీనామా చేయాల్సి వస్తుందని, తమ ప్రభుత్వం పడిపోతుందని బీజేపీ చెబుతోందని చంద్రబాబు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. బిల్లు ఆమోదం పొందాలంటే లోకసభలో ప్రవేశ పెట్టవచ్చునని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు.
ఎవరి రాజకీయం వారిది
ప్రత్యేక హోదాకు, జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు లింక్ పెట్టలేదన్నారు. హోదా విషయంలో ఎవరి రాజకీయం వారిదన్నారు. ఇవే పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ)లు రాష్ట్రాన్ని విభజించాయన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా డ్రామాలు ఆడుతోందన్నారు. కాంగ్రెస్, వైసిపిలు పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయన్నారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్న దీర్ఘకాలంగా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.
2 రాష్ట్రాల మధ్య విభేదాలు మంచిది కాదు
రెండు రాష్ట్రాల (తెలంగాణ, ఏపీ) మధ్య విభేదాలు మంచిది కాదని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యను కేంద్రం పరిష్కరించాలన్నారు. భద్రాచలం, ఏడు మండలాలు ఒకప్పుడు ఏపీలోనే ఉన్నాయని చెప్పారు.
కేంద్రం శాసన సభ సీట్లను పెంచాలన్నారు. సెక్షన్ 13లోని సంస్థల అంశాలపై కేంద్రమంత్రి జవదేకర్కు తెలిపానని చెప్పారు. ఇంకా రెండు విశ్వవిద్యాలయాల విషయంలో సమస్య పరిష్కారం కాలేదన్నారు.
రాయలసీమను రతనాలసీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతపురం నుంచి కరువును పారదోలుతామన్నారు. దేశంలోనే రెండో అతితక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం అన్నారు. కృష్ణా పుష్కరాలకు పలువురు కేంద్రమంత్రులను ఆహ్వానించానని చెప్పారు.