జగన్ని అడ్డుకోవడంపై వైయస్ వివేకా, మోడీకి మద్దతిస్తాం కానీ.. హోదాపై రేణుక
ఏపీకి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు.
కడప: ఏపీకి ప్రత్యేక హోదా ఆరో ప్రాణం లాంటిదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి ఆదివారం అన్నారు. హోదా సాధించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు.
ప్రత్యేక హోదాకు మద్దతుగా విశాఖలో ఆర్కే బీచ్లో జరిగే శాంతియాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తమ పార్టీ అధినేత జగన్ను విమానాశ్రయం రన్ వే పైనే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు వస్తే జాబు వస్తుందన్నారు.. బాబు వచ్చారు జాబులు రాలేదని ప్రజలు ఎదురు చూపులు చూస్తున్నారని మరో వైసిపి నేత అమర్నాథ్ రెడ్డి అన్నారు.
అదే మా అజెండా: బుట్టా రేణుక
ప్రత్యేక హోదా సాధించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని, ఆ దిశలోనే తాము ముందుకు వెళ్తామని వైసిపి ఎంపీ బుట్టా రేణుక అన్నారు. జగన్ అధ్యక్షతన వైసిపి ఎంపీలు భేటీ అయ్యారు. ఆ తర్వాత బుట్టా రేణుక మాట్లాడారు.

మిగిలిన అంశాలపై ఎంపీల సమావేశంలో చర్చించామని, అన్ని బిల్లులకు తమ పార్టీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా అంశాన్ని సీరియస్గా తీసుకొని వెళ్తున్నామన్నారు. హోదా విషయంలో ఎక్కడా రాజీ పడబోమన్నారు.
ఢిల్లీలో కాకుండా రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా...హోదా అంశంపై ఢిల్లీలో కంటే రాష్ట్రంలోనే ఎక్కువ తీవ్రత చూపుతుందన్నారు. రాష్ట్రంలో తీవ్ర ఉద్యమం జరిగినప్పుడే కేంద్రం దిగి వస్తుందన్నారు.
ఇందుకు ఉదాహరణగా తెలంగాణ అంశాన్ని ఆమె చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం ఇక్కడే జరిగిందని, ఢిల్లీలో జరగలేదన్నారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ నాయకుడు నిర్ణయం మేరకు రాజీనామాలు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications