హోదాపై చేతులెత్తేశారు: పవన్కు మోడీ ఝలక్, ఇరుకునపడ్డ బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని తేల్చి చెప్పింది. శుక్రవారం నాడు రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా పైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి హెచ్పీ చౌదరి ప్రత్యేక హోదా పైన స్పష్టత ఇచ్చారు.
తద్వారా, ఏపీకి ప్రత్యేక హోదా పైన కేంద్రం చేతులెత్తేసిందని చెప్పవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని, తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ నేతలు పలుమార్లు చెప్పారు. కేంద్రమంత్రులు కూడా ప్రత్యేక హోదా పరిశీనలో ఉందని చెబుతూ వస్తున్నారు.
శుక్రవారం నాడు రాజ్యసభలో జరిగిన చర్చలో మాత్రం ప్రత్యేక హోదా పైన కేంద్రం చేతులెత్తేసినట్లుగా స్పష్టంగా తెలిసిపోయింది. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు సిఫార్సు చేయలేదని కేంద్రమంత్రి చెప్పారు. విభజన చట్టం అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏపీకి హోదా ఇచ్చే పరిస్థితులు లేవన్నారు.
అయితే, ప్రత్యేక మినహాయింపులు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. ఏపీకి ఇప్పటికే పన్ను మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. ఇన్నాళ్లు ఏపీ బీజేపీ నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా పైన ఆశతోనే ఉన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా బిజెపిపై నమ్మకంతో ఉన్నట్లుగా కనిపించింది.
అందుకే ఆయన ప్రత్యేక హోదా పైన బిజెపిని పెద్దగా విమర్శలు చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పినందున పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పోరాటం చేయాలనే డిమాండ్లు కూడా వినిపించనున్నాయి.
చంద్రబాబుకు ఝలక్, జగన్కు ఛాన్స్
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవని కేంద్రమంత్రి చెప్పడం.. చంద్రబాబుకు షాక్ అని చెప్పవచ్చు. ఇది వైసిపి అధినేత జగన్కు కలిసి వచ్చే అంశం. హోదా ఇవ్వమని కేంద్రం చెప్పినందున ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలని జగన్ మరింత డిమాండ్ చేసే అవకాశముంది.
వెంకయ్య నాయుడు హామీ ఏమైంది
నాడు, విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు పదేళ్లు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారని, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతారని కాంగ్రెస్, ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి బిజెపి ఒకటే కారణం చెబుతోంది. బిల్లులో లేదు కాబట్టి మేం ఏం చేయలేకపోతున్నామని చెబుతున్నారు. బిల్లులో ఉన్న వాటన్నింటినీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టక పోవడాన్ని టిడిపి కూడా నిలదీస్తున్న విషయం తెలిసిందే.