స్వగృహానికి శ్రీహరి మృతదేహం: అభిమానుల కంటనీరు
హైదరాబాద్: ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రముఖ తెలుగు నటుడు శ్రీహరి భౌతికకాయం గురువారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాదులోని స్వగృహానికి చేరుకుంది. ముంబై నుంచి హైదరాబాదుకు ఈ రోజు ఉదయం వచ్చింది. అక్కడి నుండి ఇంటికి తీసుకు వచ్చారు.
శ్రీహరిని చివరిసారిగా చూసేందుకు ఆయన ఇంటికి అభిమానులు, సినీ ప్రముఖులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు తాము తమ అభిమాన నటుడి మృతిని తట్టుకోలేకపోతున్నామని, చివరిసారిగా ఆయన మృతదేహాన్ని చూసేందుకు వచ్చామని కన్నీరు కార్చుతున్నారు.
శ్రీహరి అంత్యక్రియలు రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఫాంహౌస్లో జరుగుతాయి. శ్రీహరి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్లో ఉంచనున్నారు. శ్రీహరి పార్థివ దేహానికి గురువారం బాచుపల్లిలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూతురు అక్షర సమాధి పక్కనే అంత్యక్రియలు జరుపుతున్నట్లు దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సికల్యాణ్ తెలిపారు.
కాగా, శ్రీహరి గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలి ‘తుఫాన్' ఆడియో వేడుకలో సైతం అతడు చాలా బలహీనంగా కనిపించినా ఎవరూ ఈ మరణాన్ని ఊహించలేకపోయారు. నిన్న ఉదయం ముంబైలో ‘రాంబో రాజ్కుమార్' షూటింగ్ స్పాట్లో అనూహ్యంగా కుప్పకూలిన శ్రీహరిని సమీపంలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చినా ప్రయోజనం లేకపోయింది.