విభజన: 25 పేజీల నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్: విభజనపై కేంద్ర హోంశాఖ కోరిన పదకొండు అంశాల పైన రాష్ట్ర ప్రభుత్వం 25 పేజీల నివేదికను పంపించింది. అందులో పలు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి చెందిన ఆస్తులు - అప్పులు, జల వనరులు, ప్రాజెక్టులు, హైదరాబాద్ స్టేటస్, 371 డి ఆర్టికల్ పైన స్పష్టత తదితర అంశాలతో కూడిన నివేదికను పంపించింది.
సమాచారం మేరకు.. హెచ్ఎండియే పరిధిని పదేళ్ల పాటు ఢిల్లీ తరహా కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలి. సీమాంధ్రలో నిర్మించనున్న కొత్త రాజధానికి రూ.5 లక్షల కోట్లను ఇవ్వాలి. ఏటా యాభై వేల కోట్ల చొప్పున పదేళ్ల పాటు ఇవ్వాలి. విభజనకు ముందు సీమాంధ్రలో ఉన్న పలు ప్రాంతాలను మళ్లీ వాటిలోనే కలపాలి.
భద్రాచలం, నూగురు మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో, మునగాలను కృష్ణా జిల్లాలో కలపాలి. విభజన జరిగితే నాగార్జున సాగర్, పులిచింతల, శ్రీశైలం డ్యాంలు రెండుగా చీలిపోతాయి. ఆర్టికల్ 371 డి పైన స్పష్టత ఇవ్వాలి. స్థానికులు, స్థానికేతరులను ఎలా నిర్దారిస్తారో తెలపాలి.
కొత్త రాజధానికి లక్ష ఎకరాలను కేటాయించాలి. విభజన జరిగితే విద్యుత్, జలయజ్ఞం తదితరాలకు ఇరు ప్రాంతాలకు భారీగా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎపి జెన్కో, ట్రాన్స్కో ఆస్తులను గణించాలి. ఎపిఎస్ ఆర్టీసి అప్పులను జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలి. సమస్యలు తేల్చకుండా ఆర్టికల్ 3 ప్రకారం విభజించడం కష్టం.