రాజీ లేదు, తెలంగాణకూ అన్యాయమే: జగన్కు ఉమ వార్నింగ్
హైదరాబాద్/విజయవాడ: కృష్ణా జలాల వాటా వ్యవహారంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల హక్కులను ఎట్టి పరిస్థితిల్లోనూ వదులుకోమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బ్రిజేశ్ కుమార్, సుప్రీం కోర్టుల ముందు సమర్థంగా వాదనలను వినిపించటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీర్పుపై ఎలా స్పందించాలన్న అంశంపై సంబంధిత అధికారులు, న్యాయ నిపుణులతో ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారని దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని దేవినేని తెలిపారు. తిరుపతి, విజయవాడలలో వేర్వేరుగా ఆదివారం వేర్వేరుగా జరిపిన మీడియా సమావేశంలో బ్రిజేశ్ తీర్పుపై ఆయన మాట్లాడారు. ఏపీతోపాటు తెలంగాణకు కూడా ఈ తీర్పుతో అన్యాయం జరిగిందని అన్నారు.
ఈ అంశంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ పాలనలో చేసిన దుర్మార్గపు విధానాలతో నేడు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ఆల్మట్టి జలాశయం ఎత్తు 524 మీటర్లకు పెంపుపై కర్నాటక ప్రభుత్వానికి అనుకూలంగా రావడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణమని, ఇందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తెలంగాణా రాష్ట్ర రైతాంగానికి ఎనలేని అన్యాయం జరిగిందని దేవినేని విమర్శించారు.
జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక
అన్నీ తెలిసి కూడా ప్రతిపక్ష నేత జగన్ మీడియా అడ్డగోలు రాతలు, ప్రసారాలు చేస్తుందంటూ దీనిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోగలదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. 1978లో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబునాయుడులాంటి నాయకులకు జగన్ లాంటివారో, మరొకరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు
బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేయటానికి 7 వారాల సమయం ఉందన్నారు. అభ్యంతరాలు తెలపడానికి ఒక వారం గడువు, సమాధానం తెలిపేందుకు రెండు వారాల గడువు, ప్రకటన సమర్పించేందుకు నాలుగు వారాల గడువు మొత్తం మీద 7 వారాల సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ట్రిబ్యునల్ ఇచ్చిందన్నారు.
ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన 90 రోజుల వరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సమయం ఉంటుందన్నారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర చర్యలు చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. నిపుణులతో చర్చించిన తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 89ను రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని నిప్పులు చెరిగారు.
కృష్ణా బేసిన్ స్టేట్లైన 4 రాష్ట్రాల్లో నీటి కొరత ఉన్నపుడు ఆ మేరకు కృష్ణా జలాలు పంపిణీ చేయాలని విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ పొందుపరచి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. ఈ సందర్భంగా కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ నేపథ్యాన్ని ఆయన వివరించారు.
మరోవైపు పోలవరంపై సోమవారం చర్చ, సమీక్షలు జరుగనున్నాయని, ఇందుకు సంబంధించి జల వనరుల అధికారులను రమ్మని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల హక్కులను పరిరక్షించడంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయబోదని ఆయన స్పష్టం చేశారు. .