దొంగ డబ్బుతో టీవీలు, పేపర్లు: జగన్పై బాబు విసుర్లు
ఒంగోలు: రాష్ట్రంలో కొంతమంది దొంగ డబ్బులతో పేపర్లు, టీవీలు పెట్టారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పటికీ పేపర్ పెట్టే స్తోమత లేకపోయిందని ఆయన అన్నారు. ఎవరి పని వాళ్లే చేయాలని ఆయన చెప్పారు. ఎవరి పని వాళ్లు చేయాలని, పేపరు పెట్టుకునేవాళ్లు వేరే ఉండాలని, రాజకీయం చేసేవాళ్లు రాజకీయం చేయాలని అన్నారు.
అలా కాకుండా దొంగ డబ్బులతో పేపరు పెట్టారని, వీళ్లు వ్యవసాయం చేసి డబ్బులు సంపాదించలేదని బాబు ధ్వజమెత్తారు. ఎలా డబ్బు సంపాదించారని ఆయన ప్రశ్నించారు. ఎన్టీ రామారావు ఎనిమిదర్నర ఏళ్లు సీఎంగా పని చేశారని, తాను తమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, కానీ పేపరు పెట్టడానికి శక్తిలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ విషయం ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు.
రైతుల పేరుతో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలోని కొండెపిలో జరిగిన రైతు సాధికారిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి బయటకు రావడంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదన్నారు.
పరిస్థితులు అనుకూలిస్తే మొత్తం రుణమాఫీ ఒకేసారి చేసేవాడినని ఆయన చెప్పారు. రైతులు వ్యవసాయ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. రుణవిముక్తి పత్రాలు తీసుకెళ్లి బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకోవాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని, రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మారేంత వరకు విశ్రమించబోనని ఆయన అన్నారు. రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామని ఆయన అన్నారు. రైతు సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కొండపి రైతు సాధికార సదస్సులో పాల్గొన్న తర్వాత చంద్రబాబు తిరుపతి బయలుదేరి వెళ్లారు.
ప్రపంచం మెచ్చే విధంగా డ్వాక్రా సంఘాలు తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. డ్వాక్రా సంఘాల మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాద్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన తెలిపారు. మహిళల సాధికారికత కోసమే డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించామని తెలిపారు
రైతుల ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతోనే రుణ మాఫీ ప్రకటించామని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటి నుంచి రైతులు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఏపీని లాజిస్టిక్ హబ్గా తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయన అన్నారు. రైతుల్లో ధైర్యం రావాలని, రాబోయే రోజుల్లో నమ్మకంతో వ్యవసాయం చేయాలని, ఇది జరగాలంటే మొదటి దశగా రుణ మాఫీ చేయాలని ఆ రోజున ఆలోచన చేశామని బాబు చెప్పారు.
రుణమాఫీపై బ్యాంకులు, ఆర్బీఐ సహకరించకపోయినా పట్టు విడవలేదని, కమిటీ వేసి, నివేదికలు తెప్పించుకుని, ఒక విధానం రూపొందించి, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రుణ మాఫీ అమలు చేశామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సిడ్నీలో గుంటూరువాసిపై చంద్రబాబు ఆరా
సిడ్నీలో గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశ్వకాంత్ అంకిరెడ్డి నిర్బంధం సంఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడాలని ఆయన అధికారులను ఆదేశించారు.