అప్పుడు.. ఇప్పుడు అమరావతిలో కుట్ర, అలజడి సృష్టిస్తే: చినరాజప్ప హెచ్చరిక
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పంట పొలాల దగ్ధం పైన ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పంట పొలాల దగ్ధం పైన ఆయన మంగళవారం నాడు మాట్లాడారు. ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో అలజడి సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రాజధాని ప్రకటన వచ్చాక పొలాలు తగులబడ్డాయని గుర్తు చేశారు. అలాగే అమరావతి శంకుస్థాపన తర్వాత కూడా పంట పొలాలు దగ్ధమయ్యాయన్నారు. అంటే ఇందులో కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. దీనిపై తాము విచారణ జరుపుతున్నామని చెప్పారు.
ప్రశాంతంగా ఉండే రాజధాని ప్రాంతంలో అలజడి సృష్టిస్తే ప్రభుత్వం సహించదని చెప్పారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేయవలసిన అవసరం తమకు ఏమాత్రం లేదని చెప్పారు.
మరోవైపు కాకినాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిపై చినరాజప్ప స్పందించారు. ఆయన జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
కాగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలి 50 ఇళ్లు దగ్ధమయ్యాయి. 3 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.