బీజేపిలో చేరగానే సుజనా పునీతుడు కాలేడు..! ఐటీ, ఈడీ ల నుంచి తప్పించుకోలేడన్న మురళీధర్ రావు..!!
న్యూడిల్లీ/హైదరాబాద్ : టీడిపి రాజ్యసభ సభ్యుల చేరిక పట్ల బీజేపిలో భిన్న స్వారాలు వినిపిస్తున్నాయి. టీడిపి సభ్యుల చేరిక పట్ల ఆ పార్టీ కార్యనిర్వాహక అద్యక్షుడు జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేస్తుంటే ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాత్రం ఎడమోహం పెడమోహంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి బీజేపీలో చేరినంత మాత్రాన ఐటీ, ఈడీల నుంచి తప్పించుకోలేరని ఆ పార్టీ నేత మురళీధరరావు అన్నారు.
టీడీపీ ఎంపీలో బీజేపీలో చేరికపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసమే టీడీపీ ఎంపీలను పార్టీలో చేర్చుకున్నామని అన్నారు. మెజారిటీ ఎంపీలు విలీనం అయితే అనైతికం ఎలా అవుతోందని మురళీధరరావు ప్రశ్నించారు. ఎన్నికల్లో పరాజయ భారం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే... తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో 'విలీనం' అయిపోయింది. పెద్దల సభలో టీడీపీ పక్ష నేత సుజనా చౌదరి, ఉప నేత సీఎం రమేశ్, ఇద్దరు సభ్యులు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ గురువారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రధానితో భేటీ ఐన ఫిరాయింపు ఎంపీలు..! భవిష్యత్ కార్యాచరణపై చర్చ..!!
బీజేపి లో చేరిన ఎంపీలు సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేశ్ ఇవాళ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. నిన్న అమిత్ షా సహా మిగిలిన నాయకులను కలిసిన ఎంపీలు ఇవాళ మోదీతో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యులతో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి కూడా ప్రధానిని కలిశారు. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపిలోకి వచ్చే నాయకులకు ఎలాంటి గుర్తింపు ఇవ్వాలి, ఇప్పటికే పార్టీలో చేరినవారు ఎలాంటి బాధ్యతలు చేపట్టాలనే దానిపై ప్రధానితో మాట్లాడినట్టు సమాచారం.

హర్షం వ్యక్తం చేసిన నడ్డా..!!
ఏపిలో బీజేపీకి ఇక తిరుగు లేదు..! హర్షం వ్యక్తం చేసిన నడ్డా..!!
భారతీయ జనతా పార్టీలో తెదేపా రాజ్యసభాపక్షం విలీన ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఆరుగురు ఎంపీల్లో నలుగురు బీజేపి తీర్థం పుచ్చుకోవడమే కాకుండా టీడిపి పక్షాన్ని విలీనం చేస్తున్నట్లుగా చేసిన తీర్మాన లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి గురువారం అందజేశారు. ఆ వెంటనే టీడిపి పక్షాన్ని బీజేపి లో విలీనం చేసుకుంటున్నామని పేర్కొంటూ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖను బీజేపి నేతలు ఉపరాష్ట్రపతికి ఇచ్చారు. ఈ రెండు లేఖలపై తదుపరి కార్యాచరణను రాజ్యసభ ఛైర్మన్ చేపడతారని బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. బీజేపి ప్రధాన కార్యాలయంలో టీడిపి ఎంపీలకు కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం బీజేపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు నలుగురు ఎంపీలు బీజేపి సభ్యులయ్యారని చెప్పారు. బీజేపి అందరినీ కలుపుకొని వెళ్తుందని వివరించారు. ఈ నలుగురు నాయకుల రాకతో ఏపీలో బీజేపి బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యుల దారిలో మరికొంత మంది..! ఖాళీ కాబోతున్న ఏపి టీడిపి..!!
తెలుగుదేశం పార్టీలో మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన కొందరు ముఖ్య నాయకులు నాలుగైదు రోజుల్లో హైదరాబాద్ లేదా ఢిల్లీలో సమావేశమవబోతున్నారు. పార్టీలో కొనసాగాలా? మారాలా? అని తర్జనభర్జన పడుతున్న నాయకులు ఒక స్పష్టత కోసం ఈ సమావేశాన్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిలో గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం వంటి జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులున్నారు. వారిలో చాలామంది భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశముందని, దానిపై చర్చించేందుకే సమావేశమవబోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
Recommended Video


నేను పార్టీ మారను..! మారితే ముందే చెబుతానన్న కేసినేని నాని..!!
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని టీడిపి ఎంపీ కేశినేని నాని స్పష్టంచేశారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానన్నారు. ప్రజల కోసం ఏపీ సీఎం జగన్ వద్దకు.. ప్రధాని వద్దకు.. మంత్రుల వద్దకైనా వెళ్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపి ప్రత్యేక హోదా ఇవ్వదని నాని అన్నారు. గురువారం రాత్రి దిల్లీలో నాని మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ చెప్పినందునే ఆయనను ప్రజలు నమ్మారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడు సాధిస్తారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా కోసం తాము అన్నివిధాలా పోరాటం చేసి విఫలమయ్యామన్నారు. జగన్ ప్రత్యేక హోదా సాధిస్తారనే ప్రజలు వైసీపి కి అధికారం కట్టబెట్టారని చెప్పారు. జగన్ పొర్లుదండాలు పెట్టి.. తలకిందులుగా తపస్సు చేసినా బీజేపి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వదని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications