చరిత్ర సృష్టించారు: నందమూరి తారక రామారావుతో ఆత్మీయ అనుబంధమంటూ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సినీ నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) చేసిన సేవలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు నేలను, జాతిని ఎన్టీఆర్ ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యతి అని కొనియాడారు. అడుగుపెట్టిన ప్రతీ రంగాన్ని సుసంపన్నం చేసిన ఎన్టీఆర్ జీవితం స్ఫూర్తి దాయకమని అన్నారు.
అప్పటి వరకూ ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుగుతూనే ఉంటాయి
ఎన్టీఆర్ కీర్తి అజరామరమని, తెలుగుజాతి ఉన్నంతవరకూ ఆయన జయంతులు కొనసాగుతూనే ఉంటాయని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా శనివారం విడుదల చేసిన ప్రకటనలో జస్టిస్ ఎన్వీ రమణ తన భావాలను వ్యక్తం చేశారు. విభిన్న రంగాల్లో మహా నాయకుడిగా విశ్వవిఖ్యాతులైన నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు ప్రారంభమయ్యాయని అన్నారు.
ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు: ఎన్వీ రమణ
1950ల ఆరంభంలో తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటైన మూడు దశాబ్దాల వరకూ తెలుగువాళ్లను మదరాసీలనే పిలిచేవారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన తర్వాతే తెలుగు జాతికి విశిష్టమైన గుర్తింపు లభించడం ప్రారంభమైంది. అఖిలాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పట్టి ఆయనకు అపూర్వ విజయం ప్రసాదించి, దేశ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయనానికి నాంది పలికారు అని ఎన్వీ రమణ ప్రశసించారు.
ఎన్టీఆర్తో వ్యక్తిగతంగానూ ఆత్మీయ అనుబంధముంది: ఎన్వీ రమణ
ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అంటూ నినదించిన ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యానికి కొత్త నిర్వచనం చెప్పారు. ఆయన జనరంజక పాలన దేశమంతటా అనుసరణీయమైంది. ఎన్టీఆర్ గొప్ప ప్రజాస్వామిక, లౌకికవాది. రాజ్యాంగబద్ధుడు. ఆదర్శపాలకుడు. పేదలపాలిట పెన్నిధి. ప్రజల మనిషిగా ప్రజల కోసం పని చేయదలచుకున్న ఔత్సాహికులందరికీ ఆయన జీవితం ఆదర్శం.
తెలుగు నేలను, జాతిని రామారావు ప్రభావితం చేసిన తీరు నభూతో నభవిష్యతి. ఆయన ఆశీర్వాదలతో రాజకీయరంగ ప్రవేశం చేసిన నాటి యువ నేతలు, విభిన్న పార్టీల్లో రాణిస్తూ ఉండటం.. ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన కొత్త ఒరవడికి ప్రజలు వేసిన ఆమోద ముద్రకు నిదర్శనం. వ్యక్తిగతంగానూ నాకు ఆయనతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆ మహానీయుడికి, మార్గదర్శకుడికి నా నమస్సులు అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.