అమరావతిలో ల్యాండ్ డీల్స్: ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూముల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులు తదితర ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది.

నోటీసులు జారీ..
ఈ విచారణలో మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాశ్, రిటైర్డ్ లెక్చరర్ లక్ష్మణ రెడ్డి వల్లం రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు సత్యప్రసాద్, మహేష్ బాబు పిటిషన్లో అంశాలను వివరించారు.

వందలాది ఎకరాలు..
ఏపీ ప్రభుత్వం ఎలాంటి విధానం లేకుండా వందలాది ఎకరాలను వివిధ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని పేర్కొన్నారు. అమృత వర్సిటీకి 200 ఎకరాలు, బీఆర్ఎస్ మెడిసిటీ హెల్త్కేర్ సంస్థకు 100 ఎకరాలు, ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థకు 150 ఎకరాలు, ఇలా అనేక సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెట్టిందని చెప్పిన వారు.. ఆ జీవోలను జత పరిచారు.

వీరికే...
ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్యసీ పయ్యావుల కేశవ్ కుటుంబసభ్యులు, పల్లె రఘునాథ రెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిశోర్ రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధీకులు, మంత్రి నారాయణ సంబంధీకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కూతురు లక్ష్మీసౌజన్య తదితరులకు ఈ కేటాయింపులు జరిగాయని విన్నవించారు.

పలుమార్లు ప్రస్తావించిన జగన్
ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా, అమరావతిలో భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలుమార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పలుమార్లు రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications