కోడిపందాలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది...గత ఏడాది తీర్పే ఈ ఏడాది కూడా వర్తిస్తుంది....
న్యూఢిల్లీ: పందెంరాయుళ్లు ఊపిరి బిగబట్టుకొని ఎదురుచూస్తున్న తీర్పురానేవచ్చింది. కోడిపందాలపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఈ పందాలపై గత ఏడాది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే ఈ ఏడాది కూడా వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది.
ఏపీలో కోళ్ల పందేలపై నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జరగనున్న కోడి పందేలపై శుక్రవారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. గత ఏడాది కోడి పందాల విషయమై సుప్రీం కోర్టు ఏ తీర్పు అయితే ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే తీర్పు వర్తిస్తుందని చీఫ్ జస్టిస్ బెంచ్ వెల్లడించింది.
తనిఖీల పేరుతో పోలీసులు ప్రాంగణాల్లోకి వెళ్లి కోళ్లను పట్టుకోవద్దని, రైతులను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పులో ఏమైనా మార్పులు కోరవచ్చని పిటిషనర్కు సుప్రీం సూచించింది. బీజేపీ నేత రఘురామకృష్ణం రాజు ఆశించిన విధంగానే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఏపీలో కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంలో ఆయన పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు కోడిపందాలు నిర్వహించుకోవచ్చనే అర్ధం కాదని కోడి పందాలను వ్యతిరేకించేవారు అంటుండగా, కోడి పందాల నిర్వహణకు అనుకూలంగా పిటిషనర్ పేర్కొంటున్నారు. దీనిపై మళ్లీ సందిగ్థతే నెలకొందని కోడి పందాలను వ్యతిరేకించేవారు అభిప్రాయపడుతున్నారు.