అవినాష్ కు సుప్రీంలో చుక్కెదురు - లా అండ్ ఆర్డర్ సమస్య , సీబీఐకి విజ్ఞప్తి..!!
అవినాష్ వర్సస్ సీబీఐ ఎపిసోడ్ ఆసక్తి కర మలుపులు తీసుకుంటోంది. సీబీఐ కర్నూలులో మొహరించింది. సీబీఐ రాకతో అవినాష్ అభిమానులు పెద్ద సంఖ్యలో కర్నూలుకు తరలి వచ్చారు. ఆస్పత్రి ముందు బైఠాయించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వస్తున్నారు. సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వైసీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేసారు. సుప్రీం కోర్టులో అవినాశ్ బెయిల్ పిటీషన్ దాఖుల చేసారు. అక్కడ సుప్రీంకోర్టు ముఖ్య సూచన చేసింది.
కర్నూలులో ఉత్కంఠ : కర్నూలు ఆస్పత్రిలో ఎంపీ అవినాశ్ తల్లి చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే ఎంపీ అవినాశ్ ఉన్నారు. విచారణకు హాజరు కాకపోవటంతో సీబీఐ అధికారులు కర్నూలు చేరకోవటంతో ఉత్కంఠ మొదలైంది. వైసీపీ నేతలు, శ్రేణులు కర్నూలు ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ రోజు విచారణకు రావాల్సి ఉన్న అవినాశ్ సీబీఐకి లేఖ రాసారు. తన తల్లి ఆరోగ్య కారణాలతో తనకు విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరుతూ లేఖ రాసారు. అటు సుప్రీంకోర్టులో మరోసారి బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. అందులో రెండు అంశాలను పేర్కొన్నారు. తెలంగాణ కోర్టులో జూన్ 5 న బెయిల్ పిటీషన్ పైన విచారణ జరిగే వరకు అరెస్ట్ లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

సుప్రీంకోర్టు కీలక సూచన : మరో అభ్యర్ధనగా హైకోర్టులో తదుపరి వెకేషన్ బెంచ్ ముందు విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ముందస్తు బెయిల్ పిటీషన్ విచారించలేమని వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది. మెన్షన్ లిస్టులో ఉంటేనే విచారణ చేయగలమని స్పష్టం చేసింది. దీంతో, మెన్షన్ నింగ్ రిజిస్టార్ ను కలమని సంజయ్ కరోల్ ధర్మాసనం సూచన చేసింది. అవినాష్ కోసం సీబీఐ కర్నూలు వచ్చిందనే సమాచారంతో పెద్ద సంఖ్యలో పులివెందుల, కడప నుంచి వైసీపీ శ్రేణులు కర్నూలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు అవినాశ్ ఉన్న ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కర్నూలు జిల్లా వైసీపీ నేతలు ఆస్పత్రి వద్దకు వస్తున్నారు. ఆస్పత్రిలోకి రాకపోకల పైన పోలీసులు నిఘా పెట్టారు. సమీపంలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
వైసీపీ నేతల వ్యాఖ్యలు : ఇదే సమయంలో వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ ముందడుగు వేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని వ్యాక్యానించారు. ఆస్పత్రికి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. తన తల్లి ఆరోగ్యం మెరుగుపడ్డాక అవినాష్ రెడ్డి సహకరిస్తారుని పేర్కొన్నారు. ఈ మేరకు తాము సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నామని ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. సీబీఐ అడుగుల పైన కర్నూలులో ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో సీబీఐ అధికారులు సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. అటు అవినాష్ తల్లి ఆరోగ్యం పైన హెల్త్ బులెటిన్ విడుదల అయింది. కర్నూలు కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు..అటు న్యాయ పోరాటం నడుమ అవినాష్ ఎపిసోడ్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications